
న్యూఢిల్లీ : దేశంలోని రాజ్యసభ టివి, లోక్సభ టివిలను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని సంసద్ టీవీ పేరుతో ఏర్పాటు చేసే కొత్త ఛానల్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది. దీనికి రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రవి కపూర్ను సిఇఒగా నియమించారు. లోక్సభ టీవీ, రాజ్యసభ టీవీలు విలీనమైనా సంసద్ టీవీ పేరుతో ఉభయసభల ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2019 నవంబర్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సంయుక్తంగా లోక్సభ టీవీ, రాజ్యసభ టీవీల విలీనం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రసార భారతి మాజీ ఛైర్మన్ సూర్యప్రకాష్ దీనికి నేతృత్వం వహించారు. గత నెలలో ఈ కమిటీ తన నివేదికను కేంద్రానికి అందించింది. దీని ఆధారంగా రెండు టీవీల విలీనం నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఈ ప్రక్రియ కోసం మరో మూడు సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. సూర్యప్రకాష్ కమిటీ అధ్యయనంలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు సమావేశాల ప్రత్యక్ష ప్రసారం కొనసాగాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు నివేదికలో తెలిపారు. సమావేశాలు ముగిశాక లేదా సమావేశాలు లేనప్పుడు ఇతర అంశాలు ప్రసారం చేయాలని నిర్ణయించారు. అయితే లోక్సభకు సంబంధించిన అంశాలను హిందీలోనూ, రాజ్యసభకు సంబధించిన అంశాలను ఇంగ్లీష్లోనూ ప్రసారం చేయనున్నారు. తద్వారా సంసద్ టివికి మంచి బ్రాండ్గా గుర్తింపుతో పాటు ప్రేక్షకాదరణ పెరుగుతుందని తెలిపారు.