
చిత్తూరు (పిచ్చాటూరు) : పిచ్చాటూరు మండలంలోని వేలూరు గ్రామంలో శనివారం మూడో తరగతి చదువుకుంటున్న విద్యార్థికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో ఒక్కసారిగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న మండల అధికారులు తహసీల్దార్ టివి.సుబ్రహ్మణ్యం, ఎంపిడిఒ శ్రీనివాసులు, డాక్టర్ గాయత్రి గ్రామంలో పర్యటించి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్, శానిటైజర్ వాడుతూ, భౌతిక దూరం పాటించాలని సూచించారు. పిచ్చాటూరు మండలానికి చెన్నై దగ్గరగా ఉండడం.. వ్యాపార నిమిత్తం పిచ్చాటూరు వాసులు నిత్యం చెన్నై వెళ్లి రావడం వల్ల కూడా వైరస్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటిస్తూ జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. విద్యార్థికి కరోనా పాజిటివ్ రావడంతో పాఠశాల మూసివేశామని అధికారులు తెలిపారు.