
ఢిల్లీ: పర్యావరణ కార్యకర్త దిశా రవికి బెయిల్ మంజూరైంది. రూ.లక్ష పూచీకత్తుతో ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా స్వీడన్కు చెందిన పర్యావరణవేత్త గ్రెటా థెన్బర్గ్ టూల్కిట్ షేర్ చేసిన విషయం విధితమే. టూల్కిట్ను రూపొందించడంలో దిశా రవితో పాటు నికితా జాకబ్, శంతను ములుక్లకు సంబంధం ఉందని ఫిబ్రవరి 13న బెంగళూరులోని తన నివాసంలోనే 22ఏళ్ల దిశా రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీలో, రెండు రోజులు జైల్లో ఉన్నారు. కోర్టు తొలుత ఆమెను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఆ గడువు సోమవారంతో ముగియడంతో పోలీసుల అభ్యర్థన మేరకు మరో రోజు పొడిగించింది. అయితే, ఆ గడువు కూడా మంగళవారంతో ముగియనుండటంతో పోలీసులు మరో నాలుగు రోజుల పాటు దిశను తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. శనివారం దిశారవి బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వులో ఉంచిన న్యాయస్థానం మంగళవారం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఇంజినీర్ నికితా జాకబ్, న్యాయవాది శంతను ములుక్లకు ముంబయి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే.. దిశా రవికి ఖలిస్తానీ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదని ఆమె తరపు న్యాయవాది కోర్టులో తెలిపారు.