
న్యూఢిల్లీ : 'క్రిమినల్ నేర చరిత్ర' ఉన్నవారికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వటాన్ని సుప్రీంకోర్టు కొద్దినెలల క్రితం తప్పుబట్టింది. ఒకవేళ నేర చరిత్ర ఉన్నవాళ్లకు టికెట్లు ఇచ్చిన పక్షంలో, సంబంధిత రాజకీయ పార్టీ దానికిగల కారణాన్ని ఎన్నికల సంఘానికి తెలపాల్సి ఉంటుంది. ఇది ఫిబ్రవరి 13, 2020లో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల్లో కీలకమైంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు, మార్గదర్శకాలు అమలయ్యే పరిస్థితి కనపడటం లేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు పాత విధానాల్నే కొనసాగించాయి. నేర చరిత్ర ఉన్నవాళ్లకు పెద్ద సంఖ్యలో టికెట్లు అందజేశాయి. మొదటి దశపోలింగ్ అక్టోబరు 28న 71 స్థానాలకు జరుగుతుండగా, ఇందులో ప్రధాన పోటీ ఆర్జేడీ, బీజేపీ మధ్య నెలకొంది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి టికెట్లు ఇస్తారా? ఇలాంటి వారికి పన్ను మినహాయింపులు వర్తింపజేస్తారా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నేర చరిత్ర ఉన్నవారికి టికెట్లు ఇస్తున్న రాజకీయ పార్టీ గుర్తింపు రద్దు చేసేవిధంగా ఎన్నికల నిబంధనలు రావాలని వారు చెబుతున్నారు. ఆయా రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 1066మంది అభ్యర్థులు 71 స్థానాల్లో పోటీకి నిలబడ్డారు. 'అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్' (ఏడీఆర్) తాజా నివేదిక ప్రకారం, 328మంది అభ్యర్థులు (31శాతం) నేర చరిత్ర కలిగినవారున్నారు. ఇందులో 29మందిపై లైంగికదాడి, మహిళా హత్య, మహిళలపై నేరాలు వంటి ఆరోపణలున్నాయి. ఇద్దరు అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్ తప్ప, మిగతా 1064మంది అఫిడవిట్లను బీహార్ రాష్ట్ర ఎన్నికలసంఘం సరైన పరిశీలన జరప లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆర్జేడీకి చెందిన 41మంది తమకు నేర చరిత్ర ఉందని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మొదటి దశ పోలింగ్లో బీజేపీ అభ్యర్థులు 29మంది పోటీ చేస్తుండగా, అందులో 21మందికి నేర చరిత్ర ఉందని తేలింది. లోక్జన్శక్తి పార్టీ నుంచి 41మంది పోటీ చేస్తుండగా, 24మందికి నేర చరిత్ర ఉంది. కాంగ్రెస్ నుంచి 21మంది అభ్యర్థుల్లో 12 మందికి, జనతాదళ్ (యు) నుంచి 26 మంది అభ్యర్థుల్లో 8మందికి నేరచరిత్ర ఉంది.
244మందిపై నాన్ బెయిలబుల్ కేసులు
నేరచరిత్ర ఉన్నవాళ్లలో 244మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసులు. విచారణ సరిగా జరిగితే..ఐదేళ్లకు తక్కువ కాకుండా జైలుశిక్ష పడుతుంది. హత్రాస్లో లైంగికదాడి ఘట నపై దేశం యావత్తు ఆగ్రహం వ్యక్తమవుతున్నవేళ, బీహార్లో పలు రాజకీయ పార్టీలు లైంగికదాడి కేసుల్లో ఆరోపణలున్న అభ్యర్థుల్ని నిలబెట్టడం దేశ ప్రజల్ని నివ్వెరపర్చాయి. వామపక్షాలు మినహా మిగిలిన పార్టీలు ధనబలం ఉన్న అభ్యర్థులకు ప్రాధా న్యత ఇచ్చాయి. మొదటి దశ పోలింగ్లో నిలబడ్డ 1064మందిలో 375 మంది కోటీశ్వరులే.