
న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. రైతులు చేపడుతున్న ఆందోళన సోమవారం ఐదోరోజుకి చేరింది. నేడు ఢిల్లీకి చేరుకునే ఐదు జాతీయ రహదారులను ఘెరావ్ చేయనున్నట్లు రైతులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, షరతులతో కూడిన చర్చలను తాము అంగీకరించబోమంటూ హోం మంత్రి అమిత్షా ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి అమిత్షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్లతో పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి. నడ్డాలతో నివాసంలో సమావేశమైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. సుమారు రెండు గంటలపాటు ఈ సమావేశం కొనసాగినట్లు వెల్లడించారు.