ప్రజాశక్తి - ఏలూరు
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో దిగువస్థాయి సిబ్బంది పని తీరు తీవ్ర నిర్లక్ష్యంగా కన్పిస్తోందని, దీనివల్ల ఫిర్యాదుల పరిష్కార శాతం బాగా తగ్గుతోందని జెసి బాబూరావునాయుడు అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గొల్లవానితిప్పలోని సిఎడి భూముల్లో అక్రమంగా చేపల చెరవులు తవ్వుతున్నారని మాజీ సర్పంచి బి.విజయరాజు చేసిన ఫిర్యాదుపై జెసి తీవ్రంగా స్పందించారు. వెంటనే భీమవరం తహశీల్ధార్కు ఫోన్ చేసి చెరువులను తవ్వుతున్న ప్రయివేటు వ్యక్తులను వెంటనే నిరోధించాలని ఆదేశించారు. చుట్టలు, అగర్బత్తీలు, తలవెంట్రులకలు శుభ్రపర్చే కార్మికులు, పువ్వులు, అల్లికలు చేసే కార్మికులకు రాష్ట్రీయ స్వస్థ్య బీమా పథకాన్ని అమలు చేసి గుర్తింపు కార్డులు, స్మార్ట్ కార్డులు ఇప్పించాలని చేతివృత్తిదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కె.లత, సిహెచ్.లకిë తదితరులు జెసికి వినతిపత్రం సమర్పించారు. దీనిపై సమగ్ర విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డిఓను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్న జెసి బాబూరావునాయుడు
యలమంచి మండల సర్వేయర్కు మెమో
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఒకే చోట దీర్ఘకాలంగా పని చేస్తున్న యలమంచిలి మండల సర్వేయర్ ఎన్విఆర్కె ప్రసాద్కు మెమో జారీ చేసి తగు చర్యలు తీసుకోవాలని జెసి బాబూరావునాయుడు సర్వే శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావును ఆదేశించారు. యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామానికి చెందిన మేకా కృష్ణకిషోర్ జెసికి సోమవారం వినతిపత్రం అందజేశారు. తాను ఐదేళ్ల నుంచి సర్వే చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని కృష్ణకిషోర్ ఆరోపించారు. తనకు చెందిన 3.86 ఎకరాల భూమికి హద్దులు గుర్తించాలని 2008 డిసెంబర్ ఒకటో తేదీన రూ.250 సొమ్ము ప్రభుత్వానికి చెల్లించానని పేర్కొన్నారు. దీనిపై జెసి స్పందిస్తూ ఐదేళ్లుగా సర్వేయర్కు తీరిక లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం సర్వేయర్ను పోలవరం ప్రాజెక్టు భూసేకరణ సర్వే విభాగంలోకి బదిలీ చేయాలని జెసి ఆదేశించారు.