ప్రణబ్, మమత, ప్రవేశపెట్టిన బడ్జెట్లు చూస్తే కర్రపోయి డోలు వచ్చే ఢాం.ఢాం... అన్న సామెత గుర్తుకొస్తోంది. పై వారికి సంపద, కిందివారిని మభ్య పెట్టడానికి వెల్ఫేర్ స్కీములు. లాలూ ప్రసాద్ బీహార్కి, జాఫర్ షరీఫ్- కర్నాటకకు రైల్వే ప్రాజెక్టులు తరలించుకుపోయినట్లుగానే బెంగాల్ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని మమత రైల్వే బడ్జెట్ రూపొందింది. ఎంతో ఆదాయమొచ్చే విజయవాడకు రెండో స్టేషనుగాని, ఇరుకు రోడ్డులతో నిండిన ఈ నగరానికి ప్రత్యామ్నాయ రవాణాకు లోకల్ ట్రైన్ కానీ లేదు. గంటలకొద్ది ఔటర్ సిగ్నిల్ వద్ద రైళ్లు ఆగి అసౌకర్యం కలిగిస్తున్నా రెండో స్టేషన్ వేయరు. అన్ని రైళ్ళూ అవే ఫ్లాట్ఫారాలలో బయలుదేరాలి. అన్ని జంక్షన్స్కి రెండో స్టేషన్ వున్నా విజయవాడకు లేదు. కొందరు స్వలాభపరులు దేశంలోనే పేరు పొందేటట్లుగా రైల్వే లైనును ఊరుమధ్యగా పోతుందని తీసివేసారేగాని లోకల్ ట్రైన్స్ వేయలేదు. పేరుగొప్ప, ఊరుదిబ్బ అంటే ఇదే. కేంద్ర బడ్జెట్లో ప్రజలకు ఒరిగేదేమీ లేదు. సి.ఎన్.ఎస్ గ్యాస్లైన్లు విజయవాడ మీదుగా పోతున్నా ఇక్కడ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషనులు పెంచరు. బడ్జెట్ కేటాయింపులు వుండవు. బెజవాడ ఎంపీలకు ఎన్ని పనులుచేస్తే ఏమి లాభం? - ఎస్ వేణుగోపాల్, విజయవాడ.