వెన్నెముక లేనిదెవరికి?

  • భుజాలు తడుముకుంటున్న కాంగ్రెస్‌ నేతలు

కేవలం బెంగాల్‌ రాష్ట్రానికి మాత్రమే పరిమితమై మావోయిస్టులతో హింసాకాండకు పూనుకుంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌కు వంతపాడుతూ కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీ వెన్నెముక లేని విధంగా ప్రవర్తిస్తోందంటూ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలను సూటిగా తాకాయి. దీనితో బెంగాల్‌లో తృణమూల్‌ను సమర్థించాలా, వద్దా అన్న సందిగ్ధంలో వారు తలమునకలౌతున్నారు. కొందరు కాంగ్రెస్‌ నేతలయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ బుద్ధదేవ్‌ స్థాయికి ఇవి తగని వ్యాఖ్యలంటూ తృణమూల్‌తో కలిసి అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. అయితే వాస్తవానికి అనేక మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు బుద్ధదేవ్‌ వ్యాఖ్యలను పరోక్షంగా అంగీకరిస్తూ బెంగాల్‌లో ముఖ్యంగా దక్షిణ బెంగాల్‌లో తమ పార్టీ జాతీయ హోదాను కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌-తృణమూల్‌ కూటమికి, లెఫ్ట్‌ఫ్రంట్‌ ఎమ్మెల్యేలకు మధ్య గత పక్షం రోజులుగా కొనసాగుతున్న వాగ్యుద్ధం ఒక్కోసారి పరిధులు దాటి పార్లమెంటరీయేతర పద ప్రయోగం వరకూ వెళ్తోంది.

కనీస నీతి కూడా లేని ప్రతిపక్షం?

లెఫ్ట్‌ఫ్రంట్‌కు చెందిన తన తోటి మహిళా ఎమ్మెల్యేలు కనీసం ఇంటి పనిమనిషి స్థాయికి కూడా పనికిరారంటూ తృణమూల్‌ ఎమ్మెల్యే సోనాలీ గుహ చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ముఖ్యమంత్రిపై తృణమూల్‌ నేతలు కిల్లర్‌, రేపిస్ట్‌ వంటి అప్రజాస్వామికమైన, ఖండనార్హమైన పదాలు ఉపయోగిస్తూ ప్రజాజీవితంలోని హుందాతనపు హద్దులను చెరిపివేస్తుండటం ఇక్కడ సర్వసాధారణమైన విషయంగా మారింది. భారత్‌లో ఒక రాష్ట్రానికి సారధ్యం వహించే ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తున్న తమ మిత్ర పక్షాన్ని నియంత్రించేందుకు జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ఒక్కసారి కూడా ప్రయత్నించకపోవడం గమనార్హం. వారు చేస్తున్న ఈ పదప్రయోగాలన్నింటినీ అంగీకరించే కాంగ్రెస్‌ నాయకత్వం ముఖ్యమంత్రి చేసిన 'వెన్నెముకలేనితనం' అన్న వ్యాఖ్యలపై మాత్రం భుజాలు తడుముకుంటోంది. దేశంలో మావోయిస్టు హింసను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ బెంగాల్‌లో దానిని గట్టిగా సమర్థిస్తున్న తన మిత్రపక్షాన్ని నియంత్రించలేక తన నైతికబలాన్ని కోల్పోతోందని ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ మరో సందర్భంలో చేసిన ప్రస్తావన కూడా కాంగ్రెస్‌ నేతలకు సూటిగా తగిలింది.

ఉపాధి హామీలో 'ముందంజ'

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధీనంలో ఉన్న తూర్పు మిడ్నపూర్‌, దక్షిణ 24 పరగణాల వంటి కొన్ని జిల్లాలు ఉపాధి హామీ కార్యక్రమాల్లో వెనుకంజ వేసినప్పటికీ రాష్ట్రం మొత్తంమ్మీద ఈకార్యక్రమం ముందంజలో ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్