హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గానే ఉంచాలి

హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గానే ఉంచాలని సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి జిల్లా కన్వీనర్‌ ఎ.కిషోర్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఫ్రీజోన్‌ కాదంటూ అసెంబ్లీలో తీర్మానించడానికి నిరసనగా శుక్రవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ, దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లాగే హైదరాబాద్‌నూ ఫ్రీజోన్‌గానే ఉంచాలని కోరారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా తీర్మానం చేసిన రోశయ్యను సిమాంధ్ర జిల్లాల పర్యటనలో అడ్డుకుంటామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను గౌరవించి హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గానే ఉంచాలని డిమాండ్‌ చేశారు. మహిళారాజ్యం జిల్లా నాయకులు పసుపులేటి ఉషాకుమారి మాట్లాడుతూ, తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నాయకులు రాజేష్‌ శర్మ, సీతారామయ్య, మహిళా కన్వీనర్‌ సంధ్య, మహిళా రాజ్యం నగర అధ్యక్షులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి : గంటా

సుప్రీంతీర్పును గౌరవించి హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ఉంచాలని ప్రజారాజ్యం పార్టీ జిల్లా కన్వీనర్‌ గంటా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఫ్రీజోన్‌ రద్దు తీర్మానం అసెంబ్లీ చరిత్రలో చీకటిరోజుగా అభివర్ణించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా, ప్రతిపక్షాలను సంప్రదించకుండా ఏకపక్షంగా తీర్మానించడం సరికాదని పేర్కొన్నారు. తీర్మానం ఆమోదంలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష టిడిపిలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని విమర్శించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్‌ బి.కాంతారావు మాట్లాడుతూ, ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యేల ఇళ్లను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఫ్రీజోన్‌ రద్దు తీర్మానాన్ని నిరసిస్తూ శనివారం బంద్‌ పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో శాప్స్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు టి.విజరుగణేష్‌, ఎయు అధ్యక్ష కార్యదర్శులు నాగేంద్ర, దొరబాబు, ఎయు జెఎసి కన్వీనర్‌ మహేష్‌, సుమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్