పింఛన్లు సకాలంలో ఇవ్వాలని కోరుతూ పౌరసంక్షేమ సంఘం, ఐద్వా ఆధ్వర్యంలో శుక్రవారం పలుచోట్ల ధర్నా నిర్వహించారు. 47వ డివిజన్ సత్యనారాయణపురంలోని ఎకెటిపిఎం స్కూల్ వద్ద ఉన్న పింఛన్ల కేంద్రం వద్ద జరిగిన ధర్నాలో డివిజన్ పౌరసంక్షేమ సంఘం అధ్యక్షులు వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ మొదటి తేదీన ఇవ్వాల్సిన పింఛన్లను 8వ తేదీన ఇస్తున్నారన్నారు. దీని వల్ల వికలాంగులు, వృద్ధులు, వితంతువులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వారికి ప్రస్తుతం ఇస్తున్న రూ.200 పెరిగిన ధర రీత్యా చాలడంలేదన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పిఎస్ఎస్ కార్యదర్శి వి.వెంకట్రామిరెడ్డి, ఐద్వా జోన్ అధ్యక్షురాలు ఎస్కె ఆషా, ఆర్.సీతామహాలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
44వ డివిజన్లో...
44వ డివిజన్లోని ఎస్టివిఆర్ స్కూల్ ప్రాంగణంలో ఉన్న పింఛన్ల పంపిణీ కేంద్రం వద్ద ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్-2 ఐద్వా అధ్యక్షురాలు ఎస్కె ఆషా మాట్లాడుతూ పింఛన్లను సక్రమంగా ఇవ్వాలని గత నెల ప్రజాపథంలో ప్రస్తావించినా శాసన సభ్యులు హామీల వర్షం కురిపించి వెళ్లారని, ఆచరణలో స్పందన కనిపించడంలేదని అన్నారు. రానున్న రోజుల్లో పింఛన్లను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. ఇదే జరిగితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా డివిజన్ కార్యదర్శి కె.సామ్రాజ్యం, కన్నమ్మ, పైడితల్లి పాల్గొన్నారు.