కళ్లేలేని కబోదులు

ఒకపక్క నిధుల కోసం పాకులాడుతున్న కార్పొరేషన్‌ పాలకులు, మరోపక్క లక్షల రూపాయలు దుర్వినియోగమవుతున్నా ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు. సాక్షాత్తూ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ హాల్లో ఉన్న అధికారుల ఛాంబర్లు, ప్రధాన ప్రజాప్రతినిధుల ఛాంబర్ల రీమోడల్‌కు లక్షల రూపాయలు వెచ్చించారు. ఇంత డబ్బు వెచ్చించినా చేసిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలను విస్మరించారు. అయినా కార్పొరేషన్‌ అధికారులు కళ్లుమూసుకుని బిల్లులు చెల్లించేశారు. అతి చిన్నగా ఉండే ఓ పార్టీ కార్పొరేటర్ల రూముకు రంగువేసి, 20 ప్లాస్టిక్‌ కుర్చీలు ఏర్పాటు చేసినందుకు అక్షరాల రూ.65 వేలు బిల్లును మంజూరు చేసేశారు. 2009 డిసెంబర్‌ 31వ తేదీన ఓచరు నెంబరు 966తో డబ్బు చెల్లించేశారు. ఇదంతా ఒకెత్తయితే గత సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాంతీయ అగ్నిమాపక అధికారి రూములో ఒక పెద్ద టేబుల్‌, కంప్యూటర్‌ బల్ల, ఆరు వైరు కుర్చీలు, ఆరు ఐరన్‌ కుషన్‌ కుర్చీలు, ఇనుపబీరువా, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ సీలింగ్‌ వేసినందుకు ఏకంగా రూ.89,996 బిల్లు పెట్టారు. దీన్ని కూడా ఏ మాత్రమూ పరిశీలించకుండా ఓచరు నెంబరు 965తో అదే రోజున చెల్లించారు. అలాగే వాయిస్‌రూములో ధర్మాకోల్‌ సీలింగ్‌, వాల్‌ ప్యానలింగ్‌కు మొత్తం రూ.3,56,796 చెల్లించారు. కాళేశ్వరరావు మార్కెట్లో టి.వి.ఎస్‌.చలపతిరావు విగ్రహానికి ఇనుప నిచ్చెన వేసినందుకు ఓచరు నెంబరు 1477 పేరుతో ఈ ఏడాది జనవరి 31వ తేదీన ఏకంగా రూ.57,434 చెల్లించేశారు. ఈ నిచ్చెన రూ.20 వేలు కూడా ఉండదని చెబుతున్నారు. అసలే అప్పుల ఊబిలో కునారిల్లుతున్న కార్పొరేషన్లో లక్షల రూపాయలను లెక్కాపత్రం లేకుండా చెల్లించేస్తున్నారు. బిల్లుల చెల్లింపులో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా కౌన్సిల్‌ హాల్లో ఉన్న వివిధ కార్యాలయాల అభివృద్ధి పేరుతో చేస్తున్న ఖర్చులకు అంతేలేకుండా పోతోంది. దీనికితోడు కౌన్సిల్‌ కాల పరిమితి ముగుస్తున్నకొద్దీ టెండర్ల లేకుండానే పనులు కేటాయించేస్తున్నారు. కబేళా లీజును గత సంవత్సరం కంటే తగ్గించి పాత లీజుదారుడికే అప్పగించారు. అదే సమయంలో కార్మికులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన జీతాలను మాత్రం నెలలతరబడి పెండింగ్‌ పెడుతున్నారు. అందుకు సవాలక్ష కారణాలు చెబుతున్నారు. అధికారుల పనులకు పాలకపక్షం తందానా అంటూ వంతపాడుతుండడంతో లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. ఏ మాత్రమూ ఉపయోగంలేని పనులను కూడా నామినేషన్ల రూపంలో కేటాయించేస్తున్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్