తాళాలు పగులగొడుతున్న అధికారులు
హామీలను అమలు చేయాలి
ప్రజాశక్తి-నెల్లూరు :ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఎనిమిదో రోజుకు చేరింది. మంగళవారం నగరంలోని మహిళా, శిశుసంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. సిఐటియు నగర కమిటీ నాయకులు జి.నాగేశ్వరరావు, రూరల్ అధ్యక్ష, కార్యదర్శులు కొండా ప్రసాద్, కిన్నెర కుమార్,ఐద్వా నగర కార్యదర్శి కే పద్మ , ఎస్ఎఫ్ఐ రూరల్ కమిటీ నాయకులు పాల్గొని అంగన్వాడీల నిరవదిక సమ్మెకు సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ అంగన్వాడీలు పని ఒత్తిడితో మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. చాలీచాలని వేతనాలతో గొడ్డు చాకిరి చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వం అంగన్శాడీ సెంటర్ల తాళాలు పగులగొట్టి సరుకులను దొంగతనంగా సచివాలయాలకు తరలించడం హేయమైన చర్య అన్నారు. తాళాలు పగలగొట్టారు..అంగన్వాడీ కార్యకర్తలు తమ కేంద్రాలకు తాళాలు వేసి ధర్నా శిభిరంలో కూర్చొని ఉండగా జిల్లా ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆర్డిఒ కార్యాలయం, స్థానిక సచివాలయం, అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ ఎసిడిపిఒ మొత్త ఆరుగురు ఓ బృందంగా ఏర్పడి నగర, రూరల్ నియోజకవర్గాల పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి తెరిచారు. నారాయణ రెడ్డి పేట పరిధిలో 5, ఆమంచర్ల పంచాయతీ పరిధిలో 10, రామచంద్రాపురం,కామాటి హరిజనవాడ, అల్లీపురం ఎస్ టి సెంటర్, గాంధీ నగర్ సెక్టార్, కొత్త వెల్లంటి ప్రాంతంలో 3, కందమూరు , కాకుపల్లి, సౌత్ మోపూరు, కెఎన్ఆర్ అంగన్ వాడి కేంద్రం, స్నేహనగర్, భక్తవత్సల నగర్, వెంగళరావు నగర్, వేదాయపాళెం సెంటర్, బాలాజీ నగర్, చిల్లకూరు సంఘం తదితర ప్రాంతాల్లో తాళాలు పగులగొట్టి అంగన్వాడీ కేంద్రాలను తెరిచారు. వెంకటేశ్వరపురం, కోటమిట్ట, శివగిరి కాలనీ, ఇరుగాళమ్మ గుడి సెంటర్, మన్సూర్నగర్, చమ్మడివారితోట, రావిచెట్టుసెంటర్, 15వ డివిజన్ ప్రాంతాలో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నం చేసి స్థానికులు అడ్డుకోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు.