- ప్రభుత్వ ఎజి పొన్నవోలు సుధాకర్రెడ్డి
ప్రజాశక్తి-నెల్లూరు : స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి నాయకులు నారా చంద్రబాబునాయుడికి చెంపపెట్టులాంటిదని ప్రభుత్వ ఎజి పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ.. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వ్యవహారంలో నిబంధనలు పాటించలేదని తెలిపారు. జిఒ ఎంఎస్ 4కు వ్యతిరేకంగా తప్పడు పత్రాలు సృష్టించి రూ.371 కోట్ల ప్రజాధనం దోచేశారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ప్రభుత్వంపై టిడిపి చేస్తోన్న కక్ష సాధింపు చర్యలు అనే ఆరోపణలు సరికాదన్నారు. నోటీసు ఇవ్వలేదనే ఒక చిన్న సాకుచూపి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ప్రజల్లో తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. చంద్రబాబు పట్ల కక్ష సాధింపు లేదుకాబట్టే జైలులో ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. కొన్ని వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను అపహస్యం చేస్తే చివరిగా సామాన్యులు ఇబ్బంది పడతారని గుర్తు చేశారు.