ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి :సీటు కోసం బిజెపి బేరసారాల బండారం బయటపడింది. టిడిపి నాయకునితో బిజెపి నాయకుడు బేరసారాలు సాగిస్తున్న కాల్ రికార్డింగ్ ఆడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తాము కర్నూలు జిల్లా ఆదోని సీటు వదులుకుంటామని, ఆలూరు సీటు ఇచ్చేలా నివేదిక పంపుతామని కర్నూలు జిల్లా బిజెపి అధ్యక్షులు కునిగిరి నీలకంఠ సోదరుడు కునిగిరి నాగరాజు టిడిపి ఆదోని నియోజకవర్గ సమన్వయకర్త మీనాక్షి నాయుడు మేనల్లుడు మారుతి నాయుడుతో మాట్లాడుతున్న ఆడియో లీకైంది. ఆదోని సీటు వదులుకునేందుకు రూ.మూడు కోట్లు ఇవ్వాలని, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికీ ముట్టజెప్పాల్సి ఉంటుందని ఆ ఆడియోలో పేర్కొన్నారు. మీనాక్షి నాయుడుతో ఈ అంశం మాట్లాడతానని మారుతి నాయుడు ఈ ఆడియోలో హామీ ఇచ్చినట్లు ఉంది. ఈ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన కొన్ని గంటలకే కర్నూలు జిల్లా బిజెపి అధ్యక్షులు కునిగిరి నీలకంఠ సోదరుడు కునిగిరి నాగరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని, తమపై కక్షతో టిడిపి నాయకులే దొంగ కాల్ రికార్డింగ్ సృష్టించారని చెప్పుకొచ్చారు.