సిఐటియు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రజాశక్తి – గూడూరు టౌన్ ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సి.ఐ.టి.యు (అనుబంధం) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపు మేరకు మునిసిపల్ పారిశుధ్య కార్మికుల నిరవధిక సమ్మె బుధవారానికి 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణ సి.ఐ.టి.యు అధ్యక్షులు బి.వి.రమణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఎలా గెెలవాలి అనే ఆలోచిస్తున్నారే కానీ, మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసారని, పలు సమస్యలు నెరవేర్చకపోవడంతో వైఎస్సార్ ప్రభుత్యం పూర్తిగా విఫలమైందని తెలిపారు . పాలకులు మాత్రం వారి అధికారాలు చేజిక్కించు కోవడం కోసం తాడేపల్లి ప్యాలెస్ కి అంకితం అయ్యారని, ఎమ్మెల్యే టికెట్లకు పరుగులు తీస్తున్నారని, ఉత్కంఠగా ఎవరికి వారే ఉన్నారే కానీ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె కానీ మరొక పక్క అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న సమ్మెలు కానీ శిబిరాలకు వద్దకు వెళ్లి వాళ్ళని పరామర్శించడం కానీ ఇంతవరకు చేయకపోవడం ప్రజలలో చర్చినీయాశంగా మారిందన్నారు. సంక్రాంతి పండగలు ముందుకు వస్తున్నాయని వాటిని దష్టిలో ఉంచుకొని సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని 18,500 జీతం ఇవ్వాలని, వారి న్యాయపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి.గోపీనాథ్, రైతు సంఘం నాయకులు జోగి శివకుమార్, కార్యదర్శి దారా. కోటేశ్వరావు, బి.పెంచల ప్రసాద్, రాఘవయ్య, శ్రామిక మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు,బి. ఎస్.ప్రభావతి, ఎం.సంపూర్ణమ్మ పాల్గొన్నారు.