సాయం కోసం తుపాను బాధితుల ధర్నా

Dec 13,2023 21:40 #cpm, #Dharna

ప్రజాశక్తి -నెల్లూరు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో తుపాన్‌ ప్రభావంతో నష్టపోయిన తమకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేస్తూ బాధితులు ధర్నా చేశారు. తొలుత సిపిఎం ఆధ్వర్యంలో గాంధీబమ్మ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ.. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తుపాను కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయని అన్నారు. ఇళ్లలోని వరద నీరు చేసి వస్తువులు, బట్టలు, ఆహార సరుకులు తడిచిపోయాయని, నిరాశ్రయులుగా సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారని తెలిపారు. బాధితుల్లో కొంతమందికి రూ.2500 ఇచ్చి అదే సహాయంగా చెబుతున్నారన్నారు. బాధితులందరికీ 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు తక్షణమే అందించాలని, నీట మునిగిన ఇళ్లకు రూ.ఐదు వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. పదివేలు, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నగరంలో దెబ్బతిన్న రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కోరారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు పి సూర్యనారాయణ, నగర కమిటీ సభ్యులు ఆర్‌ శ్రీనివాసులు, ఐద్వా నగర కార్యదర్శి కత్తి పద్మ, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

➡️