సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌ బాబు

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌ బాబు

అంబేద్కర్‌ భవన్‌లో అదనపు సౌకర్యాలు కల్పిస్తాం : కలెక్టర్‌

        హిందూపురం : హిందూపురం పట్టణంలో నిర్మించిన అంబేద్కర్‌ భవన్‌కు అవసరమైన అదనపు సౌకర్యాల కోసం కృషి చేస్తామని కలెక్టర్‌ అరుణ్‌ బాబు అన్నారు. పట్టణంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ భవన్‌ నిర్మాణాన్ని సాంఘిక సంక్షేమ శాఖ నిధుల నుంచి రూ.2కోట్లతో పూర్తి చేశారు. ఈ భవనాన్ని కలెక్టర్‌ అరుణ్‌ బాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌, తహశీల్దార్‌ స్వర్ణలత హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతు పట్టణంలోని ప్రధాన రహదారిలో నిర్మించిన అంబేద్కర్‌ భవన్‌ను అందుబాటులోనికి తేవడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించుకున్న ఈ భవనాన్ని ప్రజలు సద్వినియం చేసుకోవాలని సూచించారు. షెడ్యూల్డ్‌ కులాల, షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన ప్రజలు ఈ భవనాన్ని తక్కువ ఖర్చుతో వివాహాది శుభకార్యాలకు ఉపయోగించుకోవాలని సూచించారు. అంబేద్కర్‌ భవన్‌కు అవసరమైన మరిన్ని అదనపు సౌకర్యాలను కల్పిండానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఇంద్రజ మాట్లాడుతూ ప్రజలు చదువుకుంటే ఆ చదువు ద్వారా ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చునని, అంబేద్కర్‌ ఆశలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్‌, ఎపిఎంఐపి పీడీ సుదర్శన్‌, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మోహన్‌రాం, వార్డు కౌన్సిలర్‌ నాగేంద్రమ్మ, కౌన్సిలర్‌ కె సతీష్‌, అంబేద్కర్‌ భవన నిర్మాణ కమిటీ సభ్యులు జాంబవతి తదితరులు పాల్గొన్నారు.

➡️