ప్రజాశక్తి- ఎస్ఆర్ పురం
దివ్యాంగుల ఇంటర్నేషనల్ టి20 క్రికెట్ సిరీస్లో నేపాల్ దేశంపై భారత్ ఘన విజయం సాధించింది. దివ్యాంగుల క్రికెట్ పోటీలలో చిత్తూరు కుర్రోడు ఎస్ఆర్ పురం యువకుడు కొత్తపల్లిగణేష్ కీలకంగా వ్యవహరించి సత్తా చాటాడు. బుధవారం ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో జరిగిన దివ్యాంగుల ఇంటర్నేషనల్ టి20 క్రికెట్ సీరిస్ నేపాల్ ఇండియాకి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 128 పరుగులు చేసింది. 129 పరుగులు లక్ష్యంగా బరిలోకి దిగిన ఇండియా 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి ఇండియా ఘనవిజయం సాధించింది. ఇండియా ఘన విజయం సాధించడంతో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు గ్రామపంచాయతీ 50 బసవిరెడ్డిపల్లి లో ఇండియా తరఫున మొట్టమొదటిసారిగా క్రికెట్ ఆడుతున్న గణేష్ స్వగ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా గణేష్ తండ్రి మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, దేశస్థాయిలో ఎదిగి దివ్యాంగుల క్రికెట్ పోటీలలో పాల్గొని ఆడడం అందులోనూ తొలి విజయం ఇండియా సాధించడంతో తల్లి అమర, తండ్రి సుబ్రమణ్యం, అన్న వదినలు హరిప్రసాద్ లతా కుటుంబ సభ్యులతో కలిసి స్వీట్లు పంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు.