ప్రజాశక్తి-మాడుగుల: షెడ్యూల్ కులాలు, తెగలు, చట్టాల వినియోగంపై సిఐడి శాఖ అవగాహన సదస్సు నిర్వహించింది. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ పీవీ రత్నం ఆధ్వర్యంలో విశాఖపట్నం సిఐడి రీజినల్ కార్యాలయ సిఐ బి.వి.జి.ప్రసాదరావు అధ్యక్షతన షెడ్యూల్ కులాలు, తెగల అభివృద్ధిపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17ను అనుసరించి షెడ్యూల్ కులాలు, తెగల సామాజిక వర్గాల రక్షణ నిమిత్తం చట్టాలు చేయడం జరిగిందన్నారు. సమాజంలో షెడ్యూల్ కులాల, తెగల సామాజిక వర్గాల ప్రజలు అనుకున్నంత ప్రగతి సాధించలేకపోతున్నారని, ఈ నేపథ్యంలో అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులు చేయాలని అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.తహసిల్దార్ పీవీ రత్నం మాట్లాడుతూ, షెడ్యూల్ తెగల, కులాల చట్టాలపై అవగాహన కలగించడానికి ఇది మంచి వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. ఇన్చార్జ్ ఎంపీపీ తాళపురెడ్డి రాజారామ్ మాట్లాడుతూ, సామరస్యంగా అందరం కలిసి మెలిసి ఉంటున్నామని తెలిపారు. షెడ్యూల్ కులాల నాయకులు సమస్యలను అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐడి రీజనల్ కార్యాలయ ఎస్సై ఆర్ కోటేశ్వరరావు, స్థానిక పోలీస్ ఎస్సై 2 నాగరాజు, ఇన్చార్జి ఎంపీపీ రాజారామ్, జడ్పిటిసి కిముడు దేవుడమ్మ, వైస్ ఎంపీపీ శ్రీను, సర్పంచ్ యడ్ల కళావతి, సర్పంచులు పాల్గొన్నారు.