అర్జీదారుని సమస్యను అడిగి తెలుసుకుంటున్న డిఆర్ఒ
అనంతపురం కలెక్టరేట్ : వివిధ సమస్యలపై ప్రజలు స్పందనలో అందించే అర్జీలకు తక్షణం పరిష్కారం చూపాలని డిఆర్ఒ గాయిత్రిదేవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆర్డీవో గ్రంధి వెంకటేష్, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు సుధారాణి, ఆనంద్, నగరపాలక సంస్థ కమిషనర్ భాగ్యలక్ష్మితో కలిసి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై 325 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఒ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ అర్జీలకు వేగవంతంగా పరిష్కారం చూపించాలన్నారు. అర్జీలకు ఎలాంటి పెండింగ్ లేకుండా సకాలంలో పరిష్కరిస్తే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. అర్జీలను పరిష్కరించడంపై ఆయా శాఖల జిల్లా, మండల అధికారులు నిత్యం మానిటర్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఒ అశోక్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, ఐసిడిఎస్ పీడీ శ్రీదేవి, డీపీవో ప్రభాకర్ రావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నాగరాజారావు, తదితరులు పాల్గొన్నారు.