ప్రజాశక్తి – భీమవరం రూరల్
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగిస్తామని, వెనకంజ వేసేది లేదని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కళ్యాణి, హసీనా తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 16వ రోజు బుధవారం కొనసాగింది. ఈ సందర్భంగా కళ్యాణి, హసీనా మాట్లాడారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అంగన్వాడీ టీచర్ లక్ష్మమ్మ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించలేదని ఆందోళనకు గురై మృతి చెందింది. ఈ నేపథ్యంలో లక్ష్మమ్మకు అంగన్వాడీలు నివాళులర్పించారు. అనంతరం ఎంఎల్ఎ కార్యాలయానికి వెళ్లి వైసిపి పట్టణ అధ్యక్షులు తోట భోగయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు జి.విజయలక్ష్మి, మేరీ గ్రేస్, దుర్గ, వెంకటలక్ష్మి, గణేష్ పాల్గొన్నారు.మొగల్తూరు : అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన సమ్మె 16వ రోజు బుధవారం కొనసాగింది. సమ్మెలో భాగంగా నరసాపురంలోని ప్రభుత్వ చీఫ్విప్ ముదునూరి ప్రసాద్ రాజు ఇంటి ముట్టడి కార్యక్రమానికి మొగల్తూరు నుంచి అంగన్వాడీలు అధిక సంఖ్యలో భారీ ప్రదర్శనగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు పెద్దింట్లు, సారమ్మ, సీత, నాగలక్ష్మి, రేఖ శాంభవి ఉన్నారు.తాడేపల్లిగూడెం : సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అంగన్వాడీల దీక్షలు 16వ రోజుకు చేరాయి. తహశీల్దార్ కార్యాలయం నుంచి మంత్రి కొట్టు సత్యనారాయణ ఇంటి వరకూ అంగన్వాడీలు ర్యాలీగా వెళ్లారు. అక్కడ మంత్రి లేకపోవడంతో పట్టణ సిఐ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు దీన స్వరూపరాణి మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, యడవల్లి వెంకట దుర్గారావు, ప్రభారాణి, కనక మహాలక్ష్మి, వరలక్ష్మి, ప్రసన్న, గాయత్రి, వీరమ్మ పాల్గొన్నారు. అలాగే అంగన్వాడీల సమ్మెకు తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు సత్తి కోదండరామిరెడ్డి, కార్యదర్శి చెర్ల పుల్లారెడ్డి, ఉపాధ్యక్షులు కరిసాయి రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్.రంగారావు, కర్రి సుబ్బిరెడ్డి, ఆకుల నారాయణ, అడపా ఆంజనేయులు పాల్గొన్నారు.గణపవరం : సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగిస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కాటుక ఝాన్సీలక్ష్మి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమ్మెలో భాగంగా 16వ రోజు అంగన్వాడీలు ఉంగుటూరు ఎంఎల్ఎ పుప్పాల వాసుబాబు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. తొలుత గణపవరం సిఐటియు కార్యాలయానికి గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు మండలాల నుంచి అధిక సంఖ్యలో అంగన్వాడీలు ఉదయం 9 గంటలకు చేరుకున్నారు. అనంతరం భువనపల్లిలోని ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయానికి పెద్ద ప్రదర్శనగా వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు స్వర్ణకుమారి అధ్యక్షత వహించారు. సిఐటియు మండల కార్యదర్శి ఎం.పెంటారావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కాటుక ఝాన్సీ మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు వై.సుజాత, బి.రామకోటి, జె.రత్నకుమారి, కె.జయమ్మ, ఎన్.పార్వతి, ఎస్.ధనలక్ష్మి పాల్గొన్నారు. ఎంఎల్ఎ వాసు బాబుకు వినతిపత్రం అందజేస్తామని రెండు రోజుల ముందు సమాచారం అందించినా ఆయన అందుబాటులో లేని రమణారావు తెలిపారు. ధర్నా అనంతరం వినతిపత్రాన్ని క్యాంపు కార్యాలయ సిబ్బందికి అందజేసినట్లు చెప్పారుకాళ్ల : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్వి.గోపాలన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మెలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్వి.గోపాలన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు గొర్ల రామకృష్ణ, కార్యదర్శి మండా సూరిబాబు, అంగన్వాడీ సెక్టార్ లీడర్స్ దావులూరి మార్తమ్మ, యడవల్లి చంద్రావతి, ఝాన్సీ లక్ష్మీబాయి, కమల, రాజమణి, ఝాన్సీ, టీచర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు.ఆచంట : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని సిఐటియు మండల కార్యదర్శి వర్ధిపర్తి అంజిబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆచంట, పెనుగొండ, పోడూరు మండలాలకు చెందిన అంగన్వాడీలు ఆటోలు, బస్సుల్లో పోడూరు మండలం తూర్పుపాలెంలోని ఎంఎల్ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు క్యాంపు కార్యాలయానికి వెళ్లి అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. ఎంఎల్ఎ అందుబాటులో లేకపోవడంతో సుమారు అరగంట సేపు నిరసన తెలిపారు. ఎంఎల్ఎ పిఎ సురేష్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు బి.వెంకట్రావు, నాగిశెట్టి గంగారావు, పిల్లి ప్రసాద్, నేతలు కానూరు తులసి, వైట్ల ఉషారాణి, రాయుడు కుమారి, జక్కం శెట్టి ఉమాదేవి పాల్గొన్నారు. సమ్మెకు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు, అంగన్వాడీలు వైట్ల ఉషారాణి, మైలే విజయలక్ష్మి, మహేశ్వరి, జి.కమల, పద్మ, అల్లం సత్యవతి, సువర్ణ, మల్లేశ్వరి, గౌరీశ్వరి, నాగలక్ష్మి, సుజాత, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.ఆచంట (పెనుమంట్ర) : అంగన్వాడీ కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. సిఐటియు మండల కార్యదర్శి కోడే శ్రీనివాస ప్రసాద్ ఆధ్వర్యంలో చెవిలో పువ్వు పెట్టుకుని, ఒంటి కాలి మీద నిలబడి నిరసన తెలిపారు. కార్యక్రమంలో పెనుమంట్ర, ఆలమూరు, మార్టేరు సెక్టార్కు సంబంధించి సాయి మహాలక్ష్మి, మౌనిక, సరస్వతి పాల్గొన్నారు.తణుకు రూరల్ : అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం జనవరి 3వ తేదీన కలెక్టర్ కార్యాలయాలను ముట్టడి ద్వారా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్ అన్నారు. కోర్టు సెంటర్లో తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లోని అంగన్వాడీలు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఇంటిని ముట్టడించి ఆయనకు వినతిపత్రం అందజేశారు. మంత్రి కారుమూరి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. జిల్లా శ్రామిక మహిళా నాయకులు అడ్డగర్ల అజయ కుమారి పట్ల మంత్రి అనుచిత వ్యాఖ్యలు, ఏకవచనంతో మాట్లాడడాన్ని సిఐటియు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని ప్రతాప్ అన్నారు. అనంతరం కోర్టు వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు అడ్డగర్ల అజయ కుమారి, గార రంగారావు, కనక దుర్గ, వసంత కుమారి, మణి మాలతి, ప్రమీల, మధుషీల, రాజకుమారి, రజని, ధనలక్ష్మి పాల్గొన్నారు.పోడూరు : అంగన్వాడీల దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలకు విఆర్ఎల సంఘం నేతలు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ లీడర్ పీతల రాజమణి, గ్రామ సేవకుల సంఘం మండల అధ్యక్షుడు బెల్లాన్ని ప్రకాష్రావు, సిఐటియు జిల్లా కౌన్సిల్ సభ్యులు పిల్లి.ప్రసాద్, బొంతు శ్రీను, బూరాబత్తుల వెంకట్రావు, జె.ఉమాదేవి, రాయుడు కుమారి పాల్గొన్నారు.పెనుగొండ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు మండల అధ్యక్షుడు నాగిశెట్టి గంగారావు అన్నారు. ఈ సందర్భంగా రంగారావు, అంగన్వాడీ జిల్లా నాయకురాలు కె.తులసి మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్ల సిద్ధాంతం సెక్టార్ నాయకురాలు పిడి.పరమేశ్వరి, ఎల్.ఉషశ్రీ, హైమ, శ్రీదేవి, కెయుఎం.భవాని, నాగలక్ష్మి, ఉందుర్తి దుర్గ, జి నాగలక్ష్మి పాల్గొన్నారు. పాలకొల్లు : తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన దీక్షలు కొనసాగాయి. ఈ మేరకు వైసిపి పాలకొల్లు ఇన్ఛార్జి గుడాల గోపి కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. అయితే ఆయన భీమవరంలో ఉండడంతో ఆయన పిఎ.ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆటపాటలతో నిరసనఅంగన్వాడీల స్థితి గతులపై ప్రజాశక్తి ప్రత్యేక సంచికలో ప్రచురితమైన పాటను అంగన్వాడీలు ప్రాక్టీస్ చేసి పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆట పాటలతో అలరించారు. నోమి నోమన్నాల తుమ్మేతో.. నోమన్నలల్లార తుమ్మేతా.. అమ్మ గైరమ్మా తుమ్మేతో.. మొర ఆలకించమ్మా తుమ్మేతా.. జగనన్నకీ చెప్పి తుమ్మేతో.. ఈ తగువు తీర్చమ్మ తుమ్మేతా అంటూ అంగన్వాడీలు ఆడిపాడారు. ఈ పాటను అంగన్ వాడీల నేత నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఎం.శ్రీదేవి, బి.నాగలక్ష్మి, పి.పద్మ, ఎంఎ.నర్సమ్మ పాల్గొన్నారు.అత్తిలి : అంగన్వాడీలు బుధవారం బుర్రకథ రూపంలో పాటలు పాడి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు కేతా గోపాలన్, సిఐటియు సంఘం నాయకులు కర్రి ధర్మేంద్ర, మాధవి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.నరసాపురం టౌన్ : అంగన్వాడీల సమ్మె 16వ రోజుకు చేరుకుంది. బుధవారం అంబేద్కర్ సెంటర్ నుంచి పురపాలక కార్యాలయం వరకూ ర్యాలీగా బయలుదేరి అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ప్రభుత్వ చీఫ్విప్ ముదునూరి ప్రసాద్రాజుకు వినతిపత్రం సమర్పించారు. సమ్మెకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కవురు పెద్దిరాజు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు పాలూరి బాబ్జి, సిఐటియు పట్టణ కార్యదర్శి పొన్నాడ రాము సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జల్లి రామ్మోహన్ రావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ, డి.విజయలక్ష్మి, కె.భోగేశ్వరి, జి.శివరంజని, ఆర్.ఏసమ్మ, జి.ఝాన్సీ, జి.వెంకటలక్ష్మి, బి.రాజేశ్వరి, బి.వెంకటలక్ష్మి పాల్గొన్నారు.ఆకివీడు : అంగన్వాడీ కార్మికులను బెదిరించే విధానం మానుకోవాలని ఎంఎల్ఎ మంతెన రామరాజు హితవు పలికారు. సమ్మె శిబిరాలను ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ముందుగా సిఐటియు నాయకులు కె.తవిటినాయుడు మాట్లాడారు. ఎంఎల్ఎ వెంట టిడిపి మండల అధ్యక్షులు మోటుపల్లి ప్రసాద్, గంధం ఉమా సత్యనారాయణ, ఎన్.రామారావు, కె.అరుణ, బి.సరళ, కె.మరియమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.