వృద్ధుడు దారుణ హత్య

Mar 5,2024 23:14

మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
ప్రజాశక్తి-తెనాలి :
పట్టణంలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. సమీప బంధువైన యువకుడిపైనే స్థానికులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఐతానగర్‌లోని లంకెవానిదిబ్బ ప్రాంతానికి చెందిన చింతాబత్తుని ఫిలిప్‌ (62) తాపీ కార్మికుడు. ఆయన భార్య, కుమారుడు గతంలోనే మరణించగా ఒక కుమార్తె ఉన్నారు. ఫిలిప్‌ ఒంటరిగానే నివసిస్తుండగా కుమార్తె సమీపంలోనే ఉంటున్నారు. స్థానికులతో ఎంతో కలివిడిగా ఉండే ఫిలిప్‌ మద్యానికి బానిస. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం అతని నివాసానికి సమీపంలోనే మృతి చెంది ఉండటం, ఒంటిపై గాయాలు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. టూటౌన్‌ సిఐ ఎ.సుధాకర్‌ ఘటనా స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. సమీప బంధువైన యువకుడితో నెలకొన్న వివాదమే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పాతనేరస్తుడు, వరుసకు ఫిలిప్‌కు అల్లుడయ్యే యువకునితోనే వివాదం నెలకొందని, క్రిస్మస్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టార్‌ను ఆ యువకుడు మృతుని ఇంట ఉంచాడని, దానిని తీసేయాల్సిందిగా పలుమార్లు ఆ యువకుడిని ఫిలిప్‌ వారించాడని సమాచారం. సోమవారం రాత్రి ఇద్దరికీ వాదోపవాదాలు జరిగాయని, ఆగ్రహించిన యువకుడు మంగళవారం తెల్లవారుజామున ఫిలిప్‌పై విచక్షణా రహితంగా దాడిచేసి, రోడ్డుకువేసి మోది, మెడకు తాడు తగిలించి పాశవికంగా ఈడ్చి హతమార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. నిందితుడు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. దీనిపై సిఐ ఎ.సుధాకర్‌ వివరణ కోరగా స్వల్ప వివాదమే హత్యకు కారణంగా భావిస్తున్నామని, స్థానికంగా ఉన్న ఓ యువకుడిపై మృతుని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని, ఆదిశగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

➡️