విజయనగరంలో పోటాపోటీ

Mar 27,2024 21:01

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : విజయనగరం రాజకీయాలు ఆసక్తికరంగానూ, రసవత్తరంగాను సాగుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య రాజకీయం హోరాహోరీగా సాగుతోంది. దీంతో, ఈ అసెంబ్లీ స్థానంలో ప్రస్తుతం వైసిపి, టిడిపి మధ్య పోటాపోటీ పరిస్థితులు నెలకొన్నాయి. విజయనగరం నగర పాలక సంస్థలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని వైసిపి అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, ఈ ఎన్నికల్లో జనసేన అదనంగా తోడైందని, వీటితోపాటు ఎమ్మెల్యే కోలగట్ల ఏకపక్ష వైఖరి కూడా తనకు కలిసి వస్తుందని టిడిపి అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు చెబుతున్నారు. కొద్దిరోజులుగా ఇరు పార్టీల అభ్యర్థులూ ప్రచారంలో దూకుడు పెంచారు. కోలగట్ల సుమారు ఆరు నెలలుగా చాపకింద నీరులా అన్ని సామాజికవర్గాలు, ప్రాంతాలు, ఉద్యోగ, వ్యాపార సంఘాలతో మమేకమై ఎన్నికల వ్యూహానికి పదును పెట్టారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో వున్నారు. కోలగట్ల చెబుతున్నట్టు నగరంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మాట వాస్తవమే. ముఖ్యంగా నగరంలో రోడ్ల విస్తరణ గడిచిన ఐదేళ్ల మునుపెన్నడూ లేనంతగానే చేపట్టారు. పార్కులూ, సెంటర్‌ లైటింగ్‌, ముఖ్యమైన కూడళ్లలో ఆకర్షనీయమైన విగ్రహాలు ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే నగరంలోని ఇదో మైలు రాయి అనే మాట వినిపిస్తోంది. ఇవన్నీ కోలగట్లకు కలిసొచ్చే అంశాలేనని పలువురు విశ్లేస్తున్నారు. కానీ, అభివృద్ధి అంటే రోడ్లు, పార్కులు, లైటింగ్‌ వంటివేనా? ఉపాధి అవకాశాలు ఏమైనా పెంచారా? కనీసం ఉన్న ఉపాధి అవకాశాలనైనా నిలబెట్టారా? జ్యూట్‌ మిల్లుల మూతకు కారకులెవరు? ఆయా స్థలాలను వసరపర్చుకున్నదెవరు? అంటూ టిడిపి అభ్యర్థితోపాటు ఆమె మద్దతుదారులు ప్రశ్నిస్తూ ప్రచారం చేస్తున్నారు. నగర అభివృద్ధిలో ప్రత్యేకించి కోలగట్ల చేసింది ఏముంది? అని కూడా వైసిపికి కౌంటర్‌ ప్రచారం చేస్తున్నారు. సొమ్ముకరిదీ సొకొకరిది అన్నట్టుగా నగరపాలక సంస్థ సొమ్ముతో చేపట్టిన పనులను కోలగట్ల తన గణకార్యంగా చెప్పుకుంటున్నారనే విమర్శలు కూడా తెలుగు తమ్ముళ్ల నుంచి వ్యక్తమౌతున్నాయి. నగరపాలక సంస్థలో మితిమీరిన జోక్యంతో పెత్తనం చలాయించి ఈ పనులన్నీ చేశారని, చివరకు సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్లకు సైతం స్వేచ్ఛలేకుండా చేశారని కూడా ప్రచారం చేస్తున్నారు. ఆయన చేసిందంటూ లేక కార్పొరేషన్‌ తరపున చేసినవన్నీ గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అదితి తండ్రి అశోక్‌ గజపతిరాజు రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా పనిచేసినా నగరానికి ఒరింగిందేమీ లేదని, అసలు ప్రజల సమస్యలే పట్టించుకోలేదని, అందువల్లే చారిత్రక విజయనగరం చాలా వెనుకబడిందని కోలగట్ల, ఆనుయాయులు చెబుతున్నారు. నగరం అభివృద్ధి జరిగిందంటే తాను ఎమ్మెల్యేగా, తన కుటుంబ సభ్యులు కార్పొరేషన్‌లో అడుగుపెట్టాకే జరిగిందని కోలగట్ల వాదన వినిపిస్తోంది. మాన్సాస్‌ భూములు, ఆస్తులు రాజులే కొల్లగొట్టారని వైసిపి నాయులు చెబుతుండగా, స్వామి ఎమ్మెల్యే అయ్యాయక నగరంలో దందాలు పెరిగిపోయంటూ టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. తాము నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పేదలకు పంపిణీ చేయలేదని టిడిపి, తమ హయాంలో వేలాది మందికి సొంత స్థలాలు, ఇళ్లు మంజూరు సాధ్యమైందని వైసిపి కేడర్‌ చెబుతోంది. ఇలా ప్రచారంలోనూ ఒకొరికొకరు ధీటుగానే దూసుకెళ్తున్నారు. గతంతో పోలిస్తే టిడిపి అభ్యర్థి తరపు ప్రచారం భిన్నంగా ఉంది. రెండు నెలల ముందు నుంచే ఇంటింటికి వెళ్లడంతోపాటు వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలతో అదితి గజపతి మమేకమౌతున్నారు. క్షేత్ర స్థాయి కేడర్‌తో కమ్యూనికేషన్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసిపి టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారేదీమా వ్యక్తం చేస్తున్నారు.

➡️