రూ.7,200 కోట్ల షాక్‌

Nov 24,2023 10:45 #amaravati, #APERC, #true up charges
  • ఈసారి మరో ట్రూ అప్‌
  • వినియోగదారులపై నాలుగో భారం
  • ఎపిఇఆర్‌సికి ప్రతిపాదన పంపిన డిస్కమ్‌లు
  • విచారణకు త్వరలో నోటిఫికేషన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ వినియోగదారులపై మరో ట్రూఅప్‌ భారం పడనుంది. ఇప్పటికే రెండు ట్రూఅప్‌లు భారం మోపిన డిస్కమ్‌లు ముచ్చటగా మూడోసారి మోపేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఒక బిల్లులో మూడు రకాలైన భారాలను వసూలు చేస్తున్నాయి. కొత్తగా రూ.7,200 కోట్లు వసూలు చేసేందుకు ఎపిఇఆర్‌సికి డిస్కమ్‌లు ప్రతిపాదనలు పంపాయి. అంటే త్వరలో నాలుగో భారం పడనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్రూఅప్‌ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి)కి ఇటీవల డిస్కమ్‌లు సమర్పించాయి. ఇఆర్‌సి అనుమతించిన దాని కంటే అదనంగా విద్యుత్‌ కొనడం వల్ల ఈ ఖర్చును వసూలు చేయదలిచినట్లు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. ఇపిడిసిఎల్‌ రూ.2,800 కోట్లు, ఎస్‌పిడిసిఎల్‌ రూ.2,500 కోట్లు, సిపిడిసిఎల్‌ రూ.1,900 కోట్లు చొప్పున ప్రతిపాదించినట్లు సమాచారం. వీటిపై విచారణ జరిపిన అనంతరం ఎంత భారం వేయాలనేది ఎపిఇఆర్‌సి నిర్ణయిస్తుంది. దీనికోసం త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. రాష్ట్రంలో మూడు డిస్కమ్‌ల పరిధిలో 1.91 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అదనపు భారాలతో జనం గగ్గోలుఇప్పటికే విద్యుత్‌ బిల్లులు మోత మోగుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం లెక్క చేయడం లేదు. డిస్కమ్‌లు రెండు ట్రూఅప్‌ల రూపంలో రూ.5,993 కోట్లను వసూలు చేస్తున్నాయి. 2014-19 కాలానికి సంబంధించిన ట్రూఅప్‌ రూ.2,910 కోట్లను 2022 ఆగస్టు నుంచి వసూలు చేస్తున్నాయి. ఇది కాకుండా 2021-22 సంవత్సరం ట్రూఅప్‌ రూ.3,083 కోట్లను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి వసూలు చేస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా నెలనెలా ట్రూఅప్‌ విధానం మే నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పేరుతో నెలకు యూనిట్‌కు రూ.0.40 పైసలు వసూలు చేస్తున్నాయి. ఈ భారం ఏడాదికి మూడువేల కోట్లపైనే ఉంది. నెల నెలా విధానం కాకుండా మరలా ఏడాది ముగిసిన తరువాత కూడా డిస్కమ్‌ లోటును భర్తీ చేసుకునేందుకు అదనపు వసూళ్లకు అవకాశం ఉంది. ఇప్పటికే వాడిన విద్యుత్‌తో పాటు అదనంగా ట్రూఅప్‌లు, ఇంధన సర్దుబాటు ఛార్జీలకే వినియోగదారులు 40 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తోంది.

➡️