రూ.2 కోట్ల పత్తి దగ్ధం

Mar 9,2024 23:15

ప్రజాశక్తి – యడ్లపాడు : మండలం పరిధి తిమ్మాపురంలోని లక్ష్మీగణపతి జిన్నంగ్‌ మిల్లులో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ మిల్లును కెవి నారాయణ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా దశబ్దకాలంగా నిర్వహిస్తున్నారు. ముడి పత్తిని ప్రాసెస్‌ చేసేందుకు శనివారం మధ్యాహ్నం రెండు గంటలప్పుడు సరుకును గోదాములోకి తరలిస్తుండగా ట్రాక్టర్‌ డోజర్‌ నుంచి రవ్వలు వచ్చి పత్తికి అంటుకుని మంటలు వ్యాపించాయి. అప్పటికే గాలులు ఎక్కువగా ఉండడంతో మంటలు త్వరాగా వ్యాపించి గోదాములోని 2500 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. పత్తి మార్కెట్‌ ధర ప్రస్తుతం క్వింటాళ్‌ రూ.7600 ఉందని, దీని ప్రకారం సుమారు రూ.రెండు కోట్ల నష్టం వాటిల్లిందని మిల్లు ఎమ్‌డి కెవి నారాయణ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే మిల్లు వాహనాలతో పాటు చిలకలూరిపేట, నరసరావుపేట నుండి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేందుకు గంటపాటు శ్రమించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

➡️