హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో తప్పులు దొర్లాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి విషయంలో అధికారులు తప్పులో కాలేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అలాగే రాష్ట్ర ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టి 2 నెలలు కూడా గడిచిపోయింది. అయితే ఆర్థిక మంత్రిగా హరీశ్రావు అని పేర్కొంటూ అధికారులు ప్రశ్నను రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కాగా హరీశ్ రావు పేరుతో అచ్చువేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మారినా.. ఆర్థిక శాఖ మంత్రి మారినా.. మాజీ మంత్రి హరీశ్ రావును ఫైనాన్స్ మినిస్టర్గా పేర్కొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇంటర్ బోర్డు తీరుపై ఇంటర్ లెక్చరర్స్ జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.