– యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి – కాకినాడ:రాబోయే ఎన్నికల్లో ఒపిఎస్ సాధనే ఎజెండా కావాలని, అందుకు ఉద్యోగ, ఉపాధ్యాయులు సన్నద్ధం కావాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కాకినాడలోని యుటిఎఫ్ హోంలో ఆదివారం ఓట్ ఫర్ ఒపిఎస్ అనే నినాదంతో పాత పెన్షన్ పునరుద్ధరణ రాజకీయ ఎజెండా కావాలని ఆకాంక్షిస్తూ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని గత ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని విస్మరించారని అన్నారు. జిపిఎస్ వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఒపిఎస్ సాధనే ఎజెండా చేయాలని అన్ని రాజకీయ పక్షాల నాయకులను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కలుస్తామని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ సంఘటిత పరచి ఒపిఎస్ సాధనే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్.ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి టి.అన్నారాం, జిల్లా అధ్యక్షుడు కెవివి నగేష్, ప్రధాన కార్యదర్శి టి.రవిచక్రవర్తి, జిల్లా కార్యదర్శి టి.సీతారామయ్య, కుటుంబ సంక్షేమ పథకం కార్యదర్శి ఎన్.గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.