ప్రజాశక్తి-మైదుకూరు(కడప) : మైదుకూరు పట్టణంలోని వీణ విజయరామరాజు కాలనీలో 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసినట్లు మైదుకూరు డిఎస్పి టి.వెంకటేశులు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. మంగళవారం మధ్యాహ్నం పక్క సమాచారంతో సుబ్బరాయుడు కొట్టం వద్ద గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మైదుకూరు మండలం గొల్లపల్లికి చెందిన మదెం సుస్మంత్ కుమార్, చెన్నూరు లక్ష్మీ నగర్కు చెందిన గంధం సుబ్బరాయుడు, ప్రొద్దుటూరు శ్రీనివాస్ నగర్కు చెందిన మేకల సునీల్, మైదుకూరు వీణ విజయరామరాజు కాలనీకి చెందిన సాంబారావు వెంకటయ్యలను అరెస్టు చేసినట్లు తెలిపారు. ముద్దాయిల వద్ద నుంచి గంజాయితో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో అర్బన్ సీఐ ఏపీ మస్తాన్, ఎస్ఐ ఎన్.రాజరాజేశ్వర్ రెడ్డి, ఎస్ఐ ఘన మదిలేటి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.