మీడియాతో మాట్లాడుతున్న తులసి రెడ్డి
మేడిపండు చందంగా జగన్ పాలన
– కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసి రెడ్డి
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్
జగన్ పాలనలో రాష్ట్రంలో సంక్షేమం మేడిపండు చందంగా తయారైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం నంద్యాల జిల్లా పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమర్ధవంతంగా పాలనను నిర్వహించిందని తెలిపారు. వైఎస్ జగన్ వచ్చాక పథకాల పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. సిఎం జగన్ నామకరణాల స్పెషలిస్ట్ అని వాఖ్యానించారు. పావలా కోడికి ముప్పావల మసాలా అన్నట్లు పని కంటే ప్రచార ఖర్చు ఎక్కువ అన్నారు. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఇచ్చింది గోరంత అని, ధరలు పెంచి ప్రజల నుంచి లాక్కున్నది కొండంత అన్నారు. జగన్ సిఎం అయ్యాక 56 నెలల కాలంలో లక్ష నలబై కోట్ల రూపాయలు అదనపు భారం ప్రజలపై పడిందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి ఉకొట్టు వాసు, నియోజకవర్గం కో ఆర్డినేషన్ సభ్యులు ఫరూఖ్, జిల్లా ఉపాధ్యక్షులు కరాటే బాలకృష్ణ, రహ్మాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు యాదవ్, జిల్లా కార్యదర్శి రియాజ్, సత్యం యాదవ్, శ్రీను, తదితర నాయకులు పాల్గొన్నారు.