ముద్దనూరులో వైసిపి, టిడిపి గ్రూపుల మధ్య ఘర్షణ

ప్రజాశక్తి – ముద్దనూరు వైసిపి, టిడిపి గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు గ్రూపులకు చెందిన వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కూర్చీలు గాలిలో విసిరి వేశారు. ఈ సంఘటనలో కారు అద్దాలు ద్వంసమయ్యాయి. వివరాలు.. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి మేన మామ వరుస అయిన శశిధర్‌ రెడ్డి దాదాపు మూడేళ్లుగా ఎమ్మెల్యేతో విభేదించి కొన్ని రోజుల కిందట ఎర్రగుంట్ల మండలం టిడిపికి చెందిన గంగవరం శేఖర్‌ రెడ్డి గ్రూపులో ఉన్నారు. గంగవరంశేఖర్‌రెడ్డి తన గ్రూపుతో కలిసి కమలాపురంలో నిర్వహించిన ‘రా కదలిరా’ కార్యక్రమంలో శశిధర్‌ రెడ్డి, మరి కొందరు చంద్రబాబు సమక్షంలో టిడిపి కండువా కప్పుకున్నారు. ఈనేపథ్యంలో శశిధర్‌రెడ్డి తన అనుచరులను జమ్మలమడుగు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయన పిలుపు మేరకు టిడిపి మండల అధ్యక్షులు శివరామిరెడ్డి, మరి కొందరు నాయకులు, కార్యకర్తలు శశిధర్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. .ఇంతలో ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, ఎమ్మెల్యే మేనమామ మునిరాజా రడ్డి తన అనుచరులతో శశిధర్‌ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న టిడిపి నాయకులపైనా, మండల అధ్యక్షులు చింతా శివరామి రెడ్డిపై దాడి చేశారు. ఆగ్రహించిన టిడిపి కార్యకర్తలు ఎమ్మెల్యేపై తిరగబడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘర్షణ జరుగుతుందని తెలిసి కూడా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. శశిధర్‌డ్డి ఇంట్లో ఉన్న టిడిపి గ్రూపు వ్యక్తులను వైసిపి నాయకులు, కార్యకర్తలు బలవంతంగా బయటకు లాగేశారు. శశిధర్‌ రెడ్డి ఇంట్లోనే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు బయట ఉన్న టిడిపి నాయకులపై కుర్చీలు విసిరడంతో అవి పోలీసులపై కూడా పడ్డాయి. టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి భూపేష్‌ రెడ్డికి సమాచారం అందడంతో శశిధర్‌ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో ఇరు గ్రూపులకు చెందిన వారు పరస్పరం కుర్చీలు, రాళ్లు విసురుకున్నారు. రాళ్ళ దాడిలో ఒక కారు, శశిధర్‌ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఇరుగ్రూపులకు చెందిన వారిని చెదరగొట్టారు ఈ ఘర్షణతో ప్రశాంతంగా ఉన్న ముద్దనూరు మండలం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని భూపేష్‌ రెడ్డి కార్యకర్తలు, శ్రేణులతో రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు సర్ది చెప్పి పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని టిడిపిలో చేరికలను జీర్ణించుకోలేక టిడిపి వర్గీయులను భయబ్రాంతులకు గురి చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని భూపేష్‌ రెడ్డి ఆరోపించారు. దేవగుడి నాయకులు జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ నాయకులను, కార్యకర్తలను ప్రలోభ పెట్టి కుటుంబంలో చీలికలు పెడుతున్నారని ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి అన్నారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు ఎవ్వరు టిడిపిలో చేరలేదన్నారు.

➡️