ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐదుసార్లు ఐపిఎల్ ట్రోఫీని సాధించడంలో కీలకపాత్ర పోషించిన రోహిత్ శర్మను కాదని కొత్త కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను శుక్రవారం ప్రకటించింది. వారసత్వ నిర్మాణంలో భాగంగా, భవిష్యత్తు తరాన్ని సిద్ధం చేసేందుకే ముంబయి ఇండియన్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఐపిఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న జట్టుగా ముంబయి ఇండియన్స్కి పేరుంది. మరోవైపు హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉండగా.. ట్రేడింగ్ ద్వారా ముంబయి ఇండియన్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ 2024 సీజన్లో ముంబయి ఇండియన్స్ని హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. ముంబయికి పదేళ్ల పాటు కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించగా… అతని సారథ్యంలో ఏకంగా 5 ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడింది. మరోవైపు కొత్త జట్టుగా వచ్చిన గుజరాత్ టైటాన్స్కి కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా, ఆడిన తొలి సీజన్లోనే 2022 ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకొని ఈ ఏడాది రన్నరప్గా నిలిచింది.