ప్రజాశక్తి-మార్కాపురం రూరల్: ఈ-మిర్చి 2.0 ప్రాజెక్ట్ యొక్క టెక్నాలజీ సహకారంతో మిరప పంటలో నాణ్యతా ప్రమాణాలను, దిగుబడులను పెంచడం అనే విషయాలను గురించి తెలుసుకోవచ్చని జిల్లా ఉద్యాన అధికారి వైఎంఎన్ గోపీచంద్ అన్నారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయ ఆవరణంలో ఈ-మిర్చి 2.0 ప్రాజెక్టుకు సంబంధించిన సమావేశం పెద్దారవీడు, మార్కాపురం, కొనకనమిట్ల, దొనకొండ, తర్లుపాడు, అర్ధవీడు, కంభం ఆర్బీకె సిబ్బందికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్బీకె సిబ్బందిని ఉద్దేశించి జిల్లా ఉద్యానవన అధికారి వైఎంఎన్ గోపీచంద్ మాట్లాడుతూ ఈ-మిర్చి ప్రాజెక్ట్ ద్వారా ఏర్పాటు చేసిన మిరప నాణ్యత పరీక్షా కేంద్రాలలో, రైతుల మిరప నాణ్యత ప్రమాణాలను పరీక్షించు కుని, వచ్చిన ఫలితాల సర్టిఫికెట్ ఆధారంగా, వ్యాపారవేత్తలు, కొనుగోలుదారుల వద్ద ఎక్కువ ధర పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే ఈ ప్రాజెక్ట్ వినియోగాలు, దాని టెక్నాలజీ గురించి రైతులకు తెలియజేయాలని ఆర్బీకె సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ గ్రీన్ సంస్థ కోఆర్డినేటర్ కమలాకర్, ఏపిఎంఐపి పీడీ రమణారావు, మార్కాపురం ఏడీఏ రామదేవి, మార్కాపురం, గిద్దలూరు హెచ్ఓలు రమేష్బాబు, విష్ణుప్రియ హెచ్ఈఓ వైసిహెచ్ శేషగిరి, మార్కాపురం, పెద్దారవీడు ఏఓలు దేవిరెడ్డి శ్రీనివాసులు, బుజ్జి బాయి, తర్లుపాడు, పెద్దారవీడు, మార్కాపురం, కంభం, అర్ధవీడు, కొనకనమిట్ల ఆర్బీకె సిబ్బంది పాల్గొన్నారు.