మహిళ దారుణ హత్య

పోలవరం: మండలంలోని కొత్త రామయ్యపేటలో ఆదివారం రాత్రి మహిళ దారుణ హత్యకు గురైంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తరామయ్యపేట పునరావాస కాలనీకి చెందిన మేడూరి దుర్గ (38) వ్యవసాయ పనులకు కూలీలను తీసుకెళ్లే మేస్త్రీగా పని చేస్తుంటారు. ఆదివారం పనులకు వెళ్లొచ్చాక యజమాని వద్ద నుంచి రూ.50 వేలు సొమ్ము తీసుకొచ్చి దానిలో కొంత ఆరుగురు కూలీలకు ఇచ్చింది. మిగిలిన సొమ్ము బీరువాలో భద్రపర్చింది. ఈలోపు బయటికెళ్లొస్తామంటూ ఏడున్నర గంటల ప్రాంతంలో దుర్గ భర్త, కుమారుడు సమీపంలో సెంటర్‌కు వెళ్లారు. రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో దుర్గ కుమారుడు ఇంటికి రాగా దుర్గ ఇంటి వాకిటోల రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉంది. వెంటనే ఆయన కేకలు వేస్తూ తండ్రికి కబురు పంపించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీనిపై దుర్గ భర్త మేడూరి ముత్యాలరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని డిఎస్‌పి ఎన్‌.సురేష్‌కుమార్‌రెడ్డి, సిఐ జి.మధుబాబు, ఎస్‌ఐ పవన్‌ కుమార్‌ పరిశీలించారు. సోమవారం ఉదయం పోలీస్‌ జాగిలాలు, క్లూస్‌ టీం, ఫోరెన్సిక్‌ నిపుణులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. పోలీస్‌ జాగిలం ఇంటి పరిసరాల చుట్టూ తిరిగి సమీపంలోని మామిడితోటలోకి వెళ్లి వెనుదిరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలవరం సిహెచ్‌సికి తరలించారు.

➡️