సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ఎస్ చెంగయ్య
ప్రజాశక్తి – మంగళగిరి : రావన్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డిఎ కూటమి అభ్యర్థులను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ఎస్ చెంగయ్య పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలోని సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ పట్టణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి వి.వి జవహర్లాల్ అధ్యక్షత వహించగా చెంగయ్య మాట్లాడుతూ దేశాన్ని మతం పేరుతో చీల్చే బిజెపి కూటమిని ఓడించాలన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బిజెపితోపాటు దాని మిత్రపక్షాలను ఓడించాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో వైసిపి ప్రభుత్వం బిజెపి విధానాలకు మద్దతిస్తూ పాలన సాగిస్తోందని, ఆ పార్టీనీ ఓడించాలని ఇండియా బ్లాక్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మంగళగిరి అసెంబ్లీకి ఇండియా బ్లాక్ అభ్యర్థి పోటీ చేస్తారని, వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు, పి.బాలకృష్ణ, పట్టణ కార్యదర్శి వై.కమలాకర్, నాయకులు ఎం.బాలాజీ, కె.ఏడుకొండలు, ఎస్.గణేష్ పాల్గొన్నారు.