ప్రజాశక్తి – పాలకొండ : జగనన్న కాలనీ సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలంతో పాటు ఎటువంటి ప్లాట్ నెంబర్లు కేటాయించకుండా ఉన్న స్థలం ఆక్రమాలకు గురికాకుండా రక్షించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు డిమాండ్ చేశారు. స్థానిక నగర పంచాయతీ పరిధిలో జగనన్న కాలనీ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పరిశీలించిన సందర్భంగా విశాలమైన ఖాళీ స్థలం ఉందన్నారు. ఈ స్థలంలో ఇటీవల కాలంలో కొంతమంది కొలరాయిలు పాతి ఆక్రమణకు ప్రయత్నిస్తే అధికార యంత్రా ంగం తొలగించిందన్నారు. అయితే అధికార యంత్రాంగం తొలగింపు తాత్కాలికమేనని, ఆ స్థలాన్ని అధికార పక్షం బినామీలకు పట్టాలిప్పించాలని ప్రయత్నిస్తుందని తెలిపారు. ప్లాట్ నెంబర్లతో కూడిన పట్టాలు ఎన్ని మంజూరు చేశారు? సామాజిక అవసరాలకు మిగతా ఖాళీగా ఉన్న స్థలాన్ని ప్రజా ప్రయోజనాల కింద ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని, శ్వేత పత్రం విడుదల చేసి ప్రజానీకానికి తెలియజేయాలని కోరారు. లేకుంటే కాలనీవాసుల్ని సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరిం చారు. పరిశీలనలో సిఐటియు మండల కార్యదర్శి కాద రాము, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దూసి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.