– జనసేన అధినేత పవన్ కల్యాణ్
– జనసేనలో చేరిన భీమవరం మాజీ ఎమ్మెల్యే అంజిబాబు
ప్రజాశక్తి – భీమవరంభీమవరం నుంచి పోటీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు స్పష్టత ఇచ్చారు. భీమవరాన్ని వదులుకోను.. నాదేనని ఆయన చేసిన వ్యాఖ్యలు పోటీకి బలాన్ని చేకూర్చాయి. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆయన కుమారుడు ప్రశాంత్ మంగళవారం భీమవరం నుంచి భారీ ర్యాలీగా మంగళగిరికి చేరుకున్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి పవన్ కల్యాణ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా భీమవరం నియోజకవర్గ ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. రామాంజనేయులు చేరిక పార్టీకి కీలకమన్నారు. గత ఎన్నికల్లో తాను గెలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఓడినా జనం గుండెల్లో స్థానం మరింత బలాన్ని ఇచ్చిందన్నారు. కుబేరులు ఉండే భీమవరం ఒక రౌడీ చేతిలో బందీ అయిందని విమర్శించారు. ‘భీమవరాన్ని వదలను అది నాదే’ అని వ్యాఖ్యానించారు. మూడు పార్టీల పొత్తుతో 2024లో విజయాన్ని మరోసారి అందుకుంటామని భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. జనసేన కండువా కప్పుకున్న అనంతరం ఆయన పై వ్యాఖ్యలు చేశారు.