భవిష్యత్తు కోసం కలిసి పోరాడుదాం : అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్

Jan 27,2024 23:13

ప్రజాశక్తి – బల్లికురవ రూరల్
ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను చిలకలూరిపేటలోని తన స్వగృహం నందు బల్లికురవ మండల జనసేన నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సారథ్యంలో రూపొందించిన 11అంశాల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్దామని, టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని, వైసీపీ అవినీతిని, ప్రజలకు చేసిన మోసాలను ఎండగడదామని తెలిపారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై రోజు రోజుకూ ప్రజల్లో పెరుగుతున్న అసహనాన్ని గుర్తిస్తూ కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు వెళ్దామని సూచించారు. ప్రజల కష్టనష్టాల్లో తోడుగా నిలిచి, అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవస్థలను ఉపయోగించుకొని వైసీపీ చేస్తున్న దాష్టీకాలను ఉమ్మడిగా ఎదుర్కొంటేనే బలమైన సమాధానం చెప్పగలమని అన్నారు. సున్నితమైన అంశాల్లో రెండు పార్టీల మధ్య వివాదాలు సృష్టించడానికి వైసీపీ సిద్ధంగా ఉందని అన్నారు. సోషల్ మీడియాను వాడుకొని లేనిపోని అపోహలు రేపేలా వైసీపీ చూస్తోందని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వివాదాస్పద అంశాలపై పూర్తిస్థాయి విచారణ తర్వాత, పార్టీల అధినాయకత్వం సూచనల మేరకు మాత్రమే స్పందించాలని సూచించారు. కార్యక్రమంలో కూలి బాలకృష్ణ, మురగొండి పూర్ణ, కొండ, ఏలూరి రాజు, గణప మురళి, వల్లంశెట్టి శ్రీను, బ్రహ్మయ్య పాల్గొన్నారు.

➡️