ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని డీసీసీ అధ్యక్షులు కామన ప్రభాకరరావు అన్నారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందన్నారు. బిజెపి దుర్మార్గపు ఆలోచనకు అడ్డుకట్ట వేయాలన్న, విశాఖ ప్లాంట్ జాతీయ పరంగా ఉండిపోవాలన్న, విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేరాలన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరారు. రాష్ట్ర ప్రత్యేక హౌదా విషయంలో ప్రధాని మోడీ ముందు వీరు ముగ్గురు స్వలాభం కోసం తలలు వంచారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హౌదాకు కట్టుబడి ఉందన్నారు. ప్రత్యేక హౌదా సాధన కోసం ఢిల్లీలో పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నాయకత్వంలో ఆంధ్రాలో ఉండే కాంగ్రెస్ అగ్ర నాయకులంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరిగిందన్నారు. ఈ ధర్నాకు ముందు ఎన్ సీ పీ, డీఎంకే, సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు శరత్ పవార్, తిరుచి శివ, సీతారాం ఏచూరి, డి రాజాలను కలిసి ప్రత్యేక హౌదాకు మద్దతు కోరడం జరిగిందన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసామన్నారు. వారందరితో కలిసి ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఢిల్లీ పెద్దలకు మరోసారి తెలియజేయడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో పార్లమెంటు ఆఖరి సమావేశాలు జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్ష హౌదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంటులో ప్రత్యేక హౌదా అంశాన్ని ప్రస్తావించడం కూడా జరిగిందన్నారు.