పాచిపెంట : ఫొటో సరదా ఓ యువకుడి ప్రాణం బలిగొంది. మండలంలోని పారమ్మకొండపై నుంచి జారిపడి యువకుడు మృతి చెందిన మంగళవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సాలూరు మండలం కూర్మరాజుపేటకు చెందిన అప్పికొండ మురళి (18), అతని మేనల్లుడు గణేష్ కలిసి మంగళవారం ఉదయం పాచిపెంట మండలంలోని పారమ్మ కొండపైకి ఎక్కి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మురళి తనతో పాటు తీసుకువచ్చిన సెల్ఫోన్ ద్వారా ఫోటోలు, వీడియోలు తీయాలని మేనల్లుడు గణేష్కు ఫోన్ ఇచ్చాడు. ఫోటో కోసం మురళి కొండ చివరికి వెళ్లి నిల్చొని ఉండగా ఇంతలో బిపి రావడంతో కళ్లు తిరిగి కాళ్లు జారి కొండపై నుండి కిందకు పడిపోయాడు. దీంతో తీవ్రగాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మురళి తండ్రి శంకరరావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నారాయణరావు తెలిపారు.