ప్రజాశక్తి – వినుకొండ : రాజకీయ ప్రయోజనాల కోసం వరికపుడిశెల ప్రాజెక్టును శంకుస్థాపనలు, పనుల పర్యవేక్షణల పేరుతో పల్నాడు ప్రజలను మోసం చేయొద్దని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, సిపిఎం పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు హనుమంతరెడ్డి అన్నారు. ఈ మేరకు స్థానిక సిపిఎం కార్యాలయంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి వైసిపి ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారని, పనులు చేపట్టాల్సిన అటవీ ప్రాంతంలో కాకుండా రైతుల పొలాల్లో పొక్లెయినర్ను తీసుకెళ్లి గుంతలు తీయించి పనులు చేస్తున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. అటవీ శాఖకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకుండా, క్యాబినెట్ మీటింగ్లో ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పడం అంటే ఓట్ల కోసం ప్రజల్ని మళ్లీ మోసం చేయడం కాదా? అని నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా నటనలు మానకుని ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.