ప్రత్యేక అవసరాల పిల్లలకు జరుగుతున్న వైద్యపరీక్షలను పరిశీలిస్తున్న సమగ్ర శిక్ష ఏపీసీ వరప్రసాద్ రావు
అనంతపురం సిటీ : జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వారి వైకల్య తీవ్రతను బట్టి అధునాతన ఉపకరణాలను అందజేస్తామని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త వరప్రసాదరావు తెలిపారు. సోమవారం గుత్తి భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఆడియాలజీ, ఆర్థోపెడిక్ , నరాల సమస్యలు గల పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీసీ హాజరై పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఐదు కేంద్రాల్లో వైకల్య మాపన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుత్తిలో దాదాపు 150 మంది పిల్లలకు వైకల్య పరీక్షలు నిర్వహించినట్లు తెలియజేశారు. వారి అవసరాన్ని బట్టి పరికరాలను అందించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సహిత విద్య కోఆర్డినేటర్ షమ, ఆల్టర్నేటివ్ స్కూల్ కోఆర్డినేటర్ కె.గోవిందరెడ్డి, గుత్తి మండల విద్యా శాఖ అధికారి మనోహర్ పాల్గొన్నారు.