ప్రజాశక్తి-కాకినాడ రూరల్ ఏళ్ల తరబడి జీవితాన్ని వృత్తికే అంకితం చేసిన అనంతరం శేష జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు సామాజిక భద్రత రీత్యా పింఛను పొందడం ఒక ప్రాథమిక హక్కు అని విద్యుత్ శాఖ రిటైర్డ్ ఎస్ఇ అడ్డాల వీరభద్రరావు పేర్కొన్నారు. రమణయ్యపేట ఎపిఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ పింఛనుదారుల దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాప్యంలో పలు రకాల అనారోగ్యాలు, రుగ్మతలు సంభవిస్తాయని, పింఛన్ సౌకర్యం ఉంటే భద్రత ఏర్పడుతుందని చెప్పారు. ఇది ఎవరి దయాదాక్షిణ్యాలపై ఇచ్చేది కాదని సుప్రీంకోర్టులో 1980లో నకారా కేసు వేశారని తెలిపారు. 1982 డిసెంబర్ 17న ఉద్యోగులకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఈరోజును పింఛనుదారుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో పింఛనుదారులైన అడ్డాల వీరభద్రరావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, న్యాయవాది యనల రామం, ఎస్.శ్రీనగేష్ పాల్గొన్నారు.