పాతబస్తీని విమానాశ్రయానికి అనుసంధానం చేసేలా మెట్రో : సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్క్‌ చూపిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కొత్త నిర్ణయాలతో దూకుడు పెంచారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన ఓఆర్‌ఆర్‌ మెట్రో ప్రాజెక్టును రద్దు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి పట్టుబడుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ నగరం చుట్టూ మెట్రోను విస్తరించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రూ.69 వేల కోట్లతో ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు గత ప్రభుత్వం కేబినెట్‌ లో నిర్ణయం తీసుకుంది. పటాన్‌ చెరు నుంచి నార్సింగి వరకు 22 కిలోమీటర్లు, తుక్కుగూడ, బెంగళూరు, పెద్ద అంబర్‌పేట వరకు 40 కిలోమీటర్ల మేర నిర్మిస్తామని పేర్కొన్నారు. మెట్రో కారిడార్‌ను తార్నాక నుంచి ఈసీఐఎల్‌ వరకు 8 కిలోమీటర్లు, మేడ్చల్‌ నుంచి పటాన్చెరు వరకు 29 కిలోమీటర్లు, ఎల్బీనగర్‌ నుంచి పెద్దార్‌ అంబర్‌పేట వరకు పొడిగించాలని నిర్ణయించారు.అలాగే రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో రైలుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. ఈ పనులకు అప్పటి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయగా.. ప్రాజెక్టు టెండర్ల దశలో ఉంది. అయితే తాజాగా మెట్రో విస్తరణ పనులకు సీఎం రేవంత్‌ బ్రేకులు వేయనున్నట్టు సమాచారం. సీఎం రేవంత్‌ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పలు అభివఅద్ధి పనులపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఓఆర్‌ఆర్‌ మెట్రో విస్తరణ ప్రాజెక్టుపైనా చర్చ జరిగింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు మెట్రో విస్తరణ అవసరం లేదని.. కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకు గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని సీఎం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్టును రద్దు చేసి పాతబస్తీని విమానాశ్రయానికి అనుసంధానం చేయాలనే ఆలోచనలో రేవంత్‌ రెడ్డి ఉన్నారు. పెండింగ్‌లో ఉన్న జెబిఎస్‌-ఫలక్‌నుమా కారిడార్‌ను పూర్తి చేయాలని , పహాడీ షరీఫ్‌ మీదుగా విమానాశ్రయం వరకు మెట్రోను పొడిగించాలని భావిస్తున్నారు. రాయదుర్గం-విమానాశ్రయం మార్గాన్ని రద్దు చేసి ఈ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా పాతబస్తీ కూడా కవర్‌ అవుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

➡️