గుంటూరులోని ప్రభుత్వ మహిళా ఓకేషనల్ కాలేజిలో విద్యార్థినులతో మాట్లాడుతున్న ప్రవీణ్ ప్రకాష్
ప్రజాశక్తి-గుంటూరు : విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. పలు పాఠశాలలు, కళాశాలలు, టెట్ సెంటర్లను సందర్శించారు. తొలుత గడ్డిపాడులోని ప్రాథమిక పాఠశాలను, పెదకాకాని హైస్కూల్ను సందర్శించారు. అనంతరం గుంటూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజిని సందర్శించారు. తరగతుల నిర్వహణ, నాడు-నేడు పనులు పరిశీలించారు. సైన్స్ ల్యాబ్ను తనిఖీ చేశారు. అధ్యాపకులతో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం ఐబి సిలబస్ను ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. ఆదివారం నుండి ప్రారంభం కానున్న ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. నాడు-నేడు ద్వారా చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేసి, వచ్చే ఏడాది కళాశాల ప్రారంభం నాటికి సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం కళాశాలలో పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం ఆర్విఆర్ అండ్ జెసి, గుంటూరు శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టెట్ పరీక్షా కేంద్రాలను అధికారులతో కలిసి సందర్శించారు. పర్యటనలో పాఠశాల విద్య ఆర్జెడి బి.లింగేశ్వరరెడ్డి, ఇంటర్ ఆర్ఐఒ జి.కె.జుబేర్, డివిఇఒ జె.పద్మ, డిఇఒ పి.శైలజ, ప్రిన్సిపాల్ జి.సునీత, ఎన్.ఆనందబాబు పాల్గొన్నారు.