– వెలుగొండను పరిశీలించిన శశిభూషణ్కుమార్
ప్రజాశక్తి-పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా):వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకారం పరిహారం చెల్లించిన తర్వాతనే ప్రాజెక్టు నుంచి నీళ్లు వదులుతామని రాష్ట్ర జలవనరుల ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. దీనిపై నిర్వాసితులు ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరంలేదని చెప్పారు. సంబంధిత శాఖ అధికారులతో కలిసి ఆయన బుధవారం వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా శశిభూషణ్కుమార్ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ లైనింగ్ పూరైందని తెలిపారు. రెండో టన్నెల్ పూర్తయ్యిందని, లైనింగ్ పనులూ శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించడంలోనూ, నిర్వాసితులను ఆదుకోవడంలోనూ కృతనిశ్చయంతో ఉందన్నారు. ఆయన వెంట ఇఎల్సి నారాయణరెడ్డి, సిఇ మురళీథర్రెడ్డి, ఎస్ఈ అబుద్ అలీం, డిఇ ముక్తేశ్వరరావు, రాంబాబుతో పాటు వెలుగొండ ప్రాజెక్టు సిబ్బంది ఉన్నారు.