ప్రజాశక్తి – పెద్దాపురం
ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉపాధి పనులు కల్పించవలసిన బాధ్యత అధికార యంత్రాంగానిదేనని పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కన్నబాబు అన్నారు. బుధవారం మండలంలోని చిన్న బ్రహ్మ దేవం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను డ్రామా పిడి అడపా వెంకటలక్ష్మి, జడ్పి సిఇఒ శ్రీరామచంద్రమూర్తి, డిపిఒ భారతి సౌజన్యలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనుల వివరాలు, కూలీల సంఖ్య, వారికి వస్తున్న వేతనాలు వంటి అంశాలపై అడిగి తెలుసుకున్నారు. మెట్ట గ్రామాల్లో వేసవిలో ఏ పనులు ఉండవని దీనిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువమందికి ఉపాధి పనులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఒ బాలామణి, ఎంపిడిఒ ఉషారాణి, ఇఒపిఆర్డి రాజశేఖర్, కాకినాడ డ్రామా ఎపిడి భాను ప్రకాష్, వసంత మాధవి, రమేష్ పాల్గొన్నారు. అలాగే స్థానిక ఎంపిడిఒ ఉషారాణి అధ్యక్షతన పంచాయతీ, సచివాలయం, ఉపాధి, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వేసవిని దృష్టిలో పెట్టుకుని ఏ గ్రామంలోనూ మంచినీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో డిపిఓ భారతి సౌజన్య, డ్రామా పిడి అడపా వెంకటలక్ష్మి, డిఎల్పిఒ బాలామణి, డిఎల్డిఒ కెఎస్వి.ప్రసాద్ పాల్గొన్నారు.