ప్రజాశక్తి- రేగిడి: సంక్షేమ పథకాలు అందిన ప్రతి కుటుంబం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని విజయనగరం జిల్లా పరిషత్తు చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్పి బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. శనివారం రేగిడి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆసరా పథకంలో భాగంగా రూ.10.54 కోట్ల చెక్కును మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు.రాజాం నియోజకవర్గం మడ్డువలస, తోటపల్లి జలాశయాల నుండి సాగునీరు అందించి, రైతు సంక్షేమాన్ని అందించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించే ఘనత ముఖ్యమంత్రి దేనని అన్నారు. సంక్షేమ పథకాలు అందిన ప్రతి ఒక్కరూ ఆలోచించి రానున్న 2024 ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుండి అత్యధిక ఓట్లు మెజార్టీతో తలే రాజేష్ను గెలిపించాలని కోరారు. రాజాం నియోజకవర్గం ఇన్చార్జి తలే రాజేష్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే రుణపడి సేవ చేసుకుంటానని అన్నారు. చైర్మన్ ప్రసంగానికి ముందే వెనుదిరిగిన మహిళలుగ్రామస్థాయిలో మహిళా సంఘ సభ్యులను ద్వితీయ శ్రేణి నాయకులు ఆటోలతో 12 గంటలకు మండల కేంద్రానికి తరలించారు. అయితే జిల్లా పరిషత్తు చైర్మన్ 3.45 గంటలకు సభా స్థలి వద్దకు రావడంతో మహిళలు సహనం కోల్పోయారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మాట్లాడుతుండగానే చాలా మంది మహిళలు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. జిల్లా పరిషత్తు చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడే సమయానికి ఖాలీ కుర్చీలే కనిపించాయి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ గేదెల వెంకటేశ్వరరావు, వైస్ ఎంపిపిలు టంకాల అచ్చెంనాయుడు, వావిలపల్లి జగన్మోహన్రావు, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, మండల ప్రత్యేకాధికారి కళ్యాణ చక్రవర్తి, ఎంపిడిఒ శ్యామల కుమారి, ఎసి చిరంజీవి, ఎపిఎం గోవిందరావు, సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు పాల్గొన్నారు.మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి: ఎమ్మెల్యేబాడంగి: డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి, మహిహిళా సాధికారికతకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయం ఆవరణలో శనివారం నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నాలుగో విడత ఆసరా పథకం కింద మండలంలో 949 స్వయం సహాయక సంఘాలు, 10,269 మంది మహిళలకు రూ.4.68 కోట్లు చెక్కును అందించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తానని మాట తప్పి చివరకు ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ పథకం కింద ఒక్కొక్కరికి కేవలం రూ.10 వేలు అందించి చేతులు దులుపేసుకున్నారని విమర్శించారు. ఇటీవల ఢిల్లీలో రిపబ్లిక్డే పరేడ్లో పాల్గొన్న ముగడ గ్రామానికి చెందిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ తెంటు గౌరీశ్వరిని ఎమ్మెల్యే సన్మానించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతి భద్రతా బలగాల్లో పనిచేస్తూ రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకోవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెసిఎస్ కోఆర్డినేటర్ శంబంగి శ్రీకాంత్, ఎంపిడిఒ ఆంజినేయులు, ఎపిఎం భాగ్యలక్ష్మి, వైసిపి మండల అధ్యక్షులు వెంకట్నాయుడు, ఎంపిపి బోగి గౌరి, జెడ్పిటిసి రామారావు, వైసిపి నాయకులు తెంటు మధు, మరిపి శంకర్, బి రమేష్, శివప్రసాద్, చిన్నపుదొర పాల్గొన్నారు.