దేశవ్యాప్తంగా ఎస్‌కెఎం కిసాన్‌ ట్రాక్టర్‌ పరేడ్‌

– 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 484 జిల్లాల్లో కవాతు

– కార్పొరేట్‌ దోపిడీ అంతం, లౌకిక ప్రజాస్వామ్య దేశాన్ని రక్షించాలని ప్రతిజ్ఞ

– దేశంలో ఎన్నడూ లేనంత రైతు వ్యతిరేక ప్రధాని మోడీ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:కార్పొరేట్‌ దోపిడీని అంతం చేయడానికి, వ్యవసాయాన్ని రక్షించడానికి, దేశాన్ని రక్షించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చిన కిసాన్‌ ట్రాక్టర్‌, వాహన కవాతు పిలుపు దేశమంతటా భారీ భాగస్వామ్యంతో, ఉత్సాహంతో విజయవంతంగా జరిగింది. ప్రతికూల పరిస్థితుల్లో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పదివేల ట్రాక్టర్లు, ఇతర వాహనాలు లక్షలాది మంది రైతులతో కవాతులో చేరాయి. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 484 జిల్లాల్లో కవాతు జరిగింది. పంజాబ్‌, హర్యానా, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో టాక్టర్‌, వాహన కవాతు జరిగింది. ముందుకు వచ్చి దేశ రైతులు, కార్మికుల దేశభక్తితో ఇంత గొప్ప విజయాన్ని అందించిన వారందరికీ ఎస్‌కెఎం అభినందనలు తెలిపింది.రైతు సంఘాలతోపాటు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా పాల్గన్నాయి. తద్వారా క్షేత్ర స్థాయిలో రైతు, కార్మిక ఐక్యతను మరింత బలోపేతం చేసింది. విద్యార్థులు, యువత, మహిళలు, ఇతర వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపారు. పరేడ్‌లో పాల్గన్నవారు మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని, రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా లౌకిక, ప్రజాస్వామ్య స్వభావాన్ని బలోపేతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తే ప్రజల విస్తృత, బలమైన ప్రతిఘటనను ఎదుర్కొంటుందని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని ఎస్‌కెఎం విమర్శించింది. 2021 డిసెంబరు 9 నాటి రాతపూర్వక హామీని, అన్ని పంటలకూ గ్యారెంటీ సేకరణతో పాటుగా సి2ప్లస్‌50 శాతంతో కూడిన ఎంఎస్‌పి సహా రైతుల ఇతర ముఖ్యమైన డిమాండ్లను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి రైతుల పోరాటంలో రెండవ దశ కవాతులో భాగమని ఎస్‌కెఎం పేర్కొంది. రైతు, వ్యవసాయ కార్మికులకు సమగ్ర రుణమాఫీ, విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణను నిలిపివేయడం, ప్రీ-పెయిడ్‌ మీటర్ల ఏర్పాటు ఆపాడం, ఇన్‌పుట్ల ఖర్చు తగ్గించడం, ప్రభుత్వ నియంత్రిత సాధారణ, సార్వత్రిక పంటల బీమాను నిర్ధారించడం, లఖింపూర్‌ ఖేరీ రైతుల హత్యాకాండకు ప్రధాన కుట్రదారుడు కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి అజరు కుమార్‌ మిశ్రా తేని తొలగింపు, ప్రాసిక్యూషన్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. ఎస్‌కెఎం ఇప్పటికే ఫిబ్రవరి 16న గ్రామీణ భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆ రోజున కార్మిక సంఘాలు కూడా పారిశ్రామిక, సెక్టోరల్‌ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ రోజు గ్రామీణ భారతదేశం స్తంభిస్తుందని ఎస్‌కెఎం భావిస్తోంది. ఈ పోరాటాన్ని రాబోయే రోజుల్లో మొత్తం రాష్ట్రాలు, జిల్లాల వరకు గ్రామాల వరకు విస్తరించి, అన్ని డిమాండ్లనూ మోడీ ప్రభుత్వం నెరవేర్చే వరకు మరింత ఉధృతం చేస్తామని పేర్కొంది.వ్యవసాయ సంక్షోభానికి దారితీసిన వ్యవసాయాన్ని కార్పొరేటీకరించడం రైతులు, కార్మికులు, యువత జీవితాలను కూడా నాశనం చేసిందని పేర్కొంది. 2014-2022 మోడీ పాలనలో 1,00,474 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. గత తొమ్మిదేళ్లలో 14.64 లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాలను మాఫీ చేసినా ఒక్క రూపాయి కూడా రైతుల రుణమాఫీ చేయలేదని తెలిపింది. ఇన్‌పుట్‌లకు సబ్సిడీల ఉపసంహరణ, ధరల పెరుగుదల వ్యవసాయంలో ఉత్పత్తి వ్యయం, రైతు కుటుంబాల రోజువారీ ఖర్చులను పెంచిందని పేర్కొంది. ఎంఎస్‌పి, రుణమాఫీ, ఏడాదికి 2 కోట్ల ఉపాధి హామీ ఎన్నికల వాగ్దానాన్ని ఉల్లంఘించి రైతులకు ద్రోహం చేసిన నరేంద్ర మోడీ, దేశంలో ఎన్నడూ లేనంత రైతు వ్యతిరేక ప్రధాన మంత్రి అని ఎస్‌కెఎం పునరుద్ఘాటించింది.

➡️