తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండ తీవ్రత..

Mar 4,2024 10:02 #high, #temparature

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరిగింది. మార్చి నెల ప్రారంభంలోనే భానుడు భగభగ మండిపోతున్నాడు. బెజవాడలో ఎండ తీవ్రత పెరిగింది. గతవారం రోజులుగా నిత్యం ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఐదు రోజుల క్రితం 33.6 డిగ్రీలు ఉన్న ఎండ.. ప్రస్తుతం ప్రతిరోజూ 35 డిగ్రీల కంటే ఎక్కువ ఎండ ఉండటంతో నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

విజయవాడలో నేడు 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు తెలంగాణలోనూ అత్యధికంగా సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈరోజు నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత కొనసాగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

భానుడి దెబ్బకు అనంతపురం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి.రాయలసీమలోనే అత్యధికంగా జిల్లాలో ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒక వైపు ఎండలు..మరో వైపు వడగాల్పులతో మధ్యాహ్నం అయిందంటే ప్రజలు బయటకు రాని పరిస్థితి నెలకొంది..మరో ఐదు రోజులు పాటు ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు..ఎండలు ఉపశమనం పొందటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాలలో ఎండలు క్రమేపీ ముదురుతున్నాయి. ఏపీలో 38 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతల నమోదవ్వగా.. ఉక్కపోత ఎక్కువైంది పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు మధ్య తేడా తగ్గిపోవడంతో మార్చి మొదటి వారంలోనే ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తోంది. వచ్చే మూడు నెలలు ఎండలు మరింత మండిపోవడం ఖాయం అని జనం భయపడుతున్నారు.

➡️