- ‘అవేక్ క్రానియోటమీ’ చికిత్స విధానంలో కణితి తొలగింపు
- మెలకువతో ఉండి బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న 5 ఏళ్ల బాలిక
ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. అక్షిత అనే ఐదేళ్ల బాలిక స్పృహలో ఉండి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయించుకుంది. చిన్నారిని మెలకువతో ఉంచి న్యూరో సర్జన్ల బృందం కణితిని విజయవంతంగా తొలగించింది. చేతనలో ఉండి ఈ సర్జరీని చేయించుకున్న ప్రపంచ అతి పిన్న వయస్కురాలిగా బాలిక నిలిచిందని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఈ సర్జరీ టెక్నిక్ని ‘అవేక్ క్రానియోటమీ’గా పిలుస్తారని, ఎడమ పెరిసిల్వియన్ ఇంట్రాయాక్సియల్ బ్రెయిన్ ట్యూమర్ తొలగింపులో దీనిని ఉపయోగించినట్టు వైద్యులు వెల్లడించారు. జనవరి 4న ఈ సర్జరీ జరిగిందని ఎయిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. సర్జరీ సమయంలో చిన్నారికి వివిధ వస్తువులు, జంతువుల బొమ్మలను చూపించారు. కాగా సర్జరీ అనంతరం చిన్నారి అక్షిత ఆరోగ్యంగానే ఉందని, సోమవారం ఇంటికి పంపించనున్నట్టు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. డాక్టర్ మిహిర్ పాండియా, డాక్టర్ జ్ఞానేంద్ర పాల్ సింగ్ నేతృత్వంలోని బృందం ఈ సర్జరీ నిర్వహించింది.